బీజేపీకి షాక్: యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నుంచి ఔట్...ఆదేశాలిచ్చిన ఈసీ
ఉత్తర్ ప్రదేశ్: ఎన్నికల ప్రచారానికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ 72 గంటల పాటు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. యోగీ ఆదిత్యనాథ్ను 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశాలు జారీచేసిన ఈసీ... బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిపై కూడా 48 గంటలు పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.
మనసున్నమారాజులు: మూడో అంతస్తు నుంచి చిన్నారిని తోసేసిన దుండగుడు...మానవత్వం చాటుకున్న దాతలు
యోగీ ఆదిత్యనాథ్, మాయావతిలు తమ ప్రసంగాల సందర్భంగా రెండు మతాల వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నిర్ధారించుకున్న తర్వాతే ఈసీ నోటీసులు పంపింది. అంతకుముందు యోగీ ఆదిత్యనాథ్ మాయావతిలు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలు నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే ఈసీ ఏంచేస్తోందంటూ ప్రశ్నించింది.వెంటనే ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
మోడీ కీ సేనా అని ఓ ర్యాలీలో యూపీ సీఎం యోగీ అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం పెద్దగా స్పందించలేదు. భారత ఆర్మీని మోడీ సేనగా అభివర్ణించడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎన్నికల సంఘం. భవిష్యత్తులో ప్రసంగాలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహించాలంటూ వార్నింగ్ ఇస్తూ నోటీసులు పంపింది.
మీకు అలీ ఉంటే మాకు భజ్రంగ్భలి ఉన్నాడంటూ మరో చోట తీవ్ర వ్యాఖ్యలు చేశారు యోగీ ఆదిత్యనాథ్. ఈ వ్యాఖ్యలపై కూడా చర్యలు తీసుకోలేదు. గ్రీన్ వైరస్ అంటూ ముస్లింలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడంతో యోగీపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే దియోబంద్లో మాయావతి ముస్లిం ఓటర్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు ప్రతివ్యాఖ్యలు చేసినట్లు యోగీ ఈసీకి వివరణ ఇచ్చారు.