ఎన్నికల సంఘం లక్ష్మణ రేఖ: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అడుగు పెట్టాలంటే..ఇవి తప్పనిసరి
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోంది. పశ్చిమ బెంగాల్ మినహా మూడురాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. పశ్చిమ బెంగాల్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. గురువారం నిర్వహించాల్సి ఉంది. దీనితో అక్కడ కూడా ఎనిమిది దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
వాటన్నింటితో పాటు ఏపీలో తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం మే 2వ తేదీన చేపట్టనుంది. దీనికోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సజావుగా ఓట్ల లెక్కింపును చేపట్టడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతంగా వీస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించాల్సి రావడం ఓ సవాల్ వంటిదే.
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఇంత భారీ ఎత్తున చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఎన్నికల కమిషనేనని, అధికారులపై మర్డర్ కేసు నమోదు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ఎలా ఉంటాయనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ పరిస్థితుల మధ్య ఊహించినట్టే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత గెలిచిన పార్టీ నిర్వహించే విజయోత్సవాలను నిషేధించింది.
Recommended Video
తాజాగా- ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశించడంపై ఆంక్షలను విధించింది. అభ్యర్థులు గానీ.. వారికి సంబంధించిన ఏజెంట్లు గానీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అడుగు పెట్టాలంటే కరోనా వైరస్ ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్ను ఎన్నికల సిబ్బందికి అందజేయాల్సి ఉంటుందని ఆదేశించింది. లేదా- కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకుని ఉండాలని పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆధారాలను చూపించిన తరువాతే ఓట్ల లెక్కింపు కేంద్రంలో అడుగు పెట్టాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, ఆదేశాలను కొద్దిసేపటి కిందటే కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది.