సారీ.. కరోనా కంటే ఎన్నికలే ముఖ్యం -బెంగాల్ పోల్ షెడ్యూల్ మార్పునకు ఈసీ నో -రేపు ఆరో దశ పోలింగ్
ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా పశ్చిమ బెంగాల్ పోలింగ్ షెడ్యూల్ ను అశాస్త్రీయంగా, బీజేపీకి అనుకూలంగా రూపొందించారంటూ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోంటున్న ఎన్నికల సంఘం మరోసారి తన సత్తా చాటుకుంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతోపాటు బెంగాల్ లోనూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండగా, ఎన్నికల షెడ్యూల్ ను చస్తే మార్చబోమంటూ దాదాపు శపథం చేసింది.
మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మొత్తం 8 దశల్లో ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తొలి నాలుగు దశలు సాఫీగానే పూర్తయినా, ఐదో దశ నాటికి బెంగాల్ సహా దేశమంతటా కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి పీక్స్ కు చేరింది. దీంతో మిగిలిన మూడు దశల్ని కలిపేసి ఒకే రోజు పోలింగ్ నిర్వహిస్తే ప్రజల ప్రాణాలు కాపాడినట్లవుతుందని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈసీని అభ్యర్థించింది.

బెంగాల్ పోల్ షెడ్యూల్ ను కుదించి ఒకే ఫేజ్ లో మిగతా ఎన్నికలన్నీ జరపాలన్న టీఎంసీ అభ్యర్థను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ బెంగాల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఫేజుల కుదింపు సవాలే ఉండదని, కొవిడ్ నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు తీసుకునైనా పోలింగ్ నిర్వహించే తీరుతామని ఈసీ కుండబద్దలుకొట్టింది. దీంతో..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ గురువారం జరుగనుంది. మొత్తం 43 అసెంబ్లీ స్థానాల్లో రేపు ఓటింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, కరోనా విలయం కారణంగా ఓటింగ్ తగ్గే అవకాశాలు లేకపోలేవు. ఈనెల 26న ఏడో విడత, 29న ఎనిమిదో విడత పోలింగ్ తో బెంగాల్ ఎన్నికలు ముగుస్తాయి. దాంతోపాటు ఎప్పుడో ఎన్నికలు పూర్తయిన అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల ఫలితాలన్నీ మే 2న వెల్లడవుతాయి.












Click it and Unblock the Notifications