మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు: 48 గంటల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ప్రచారసభలో మత ప్రాతిపదికన ఓట్లు అడిగినందుకుగానూ నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. నోటీసుపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని దీదీని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఒకవేళ సమాధానం ఇవ్వడంలో విఫలమైతే ఎలాంటి తదుపరి నోటీసు లేకుండానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ మేరకు నోటీసులు పంపింది.
కాగా, ఏప్రిల్ 3న హుగ్లీ జిల్లా తారకేశ్వర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 'దుష్టశక్తుల మాటలు విని మీ ఓట్లను చీల్చుకోవద్దని నా మైనారిటీ సోదరసోదరీమణులను కోరుతున్నాను సీపీఎం, బీజేపీకి చెందిన వ్యక్తులు మైనార్టీ ఓట్లను చీల్చేందుకు డబ్బు పట్టుకుని తిరుగుతున్నారు' అని వ్యాఖ్యానించారు. ఇలా ఓటర్లతో అనడం మతం ఆధారంగా ఓట్లు అడగడమేనని కేంద్రమంత్రి ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక, ఏప్రిల్ 10న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 4వ దశ ఎన్నికల్లో భాగంగా 44 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. హుగ్లీ, హౌరా, సౌత్ 24 పరగణాల, కూచ్ బెహర్, అలిపురర్దౌర్ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బెంగాల్ ఎన్నికలు 8 దశల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల జరుగుతున్న క్రమంలో పలు ప్రాంతాల్లో టీఎంసీ, బీజేపీ నేతలు, కార్యకర్తల ఘర్షణలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. బెంగాల్ రాష్ట్రంలో తమదే అధికారం అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. మరోసారి అధికారం చేపడతామంటూ మమతా బెనర్జీ చెప్పుకొస్తున్నారు. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామం నుంచే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారి తలపడుతున్న విషయం తెలిసిందే. మమతను 50వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానంటూ అధికారి ఇప్పటికే చెప్పారు. మరోవైపు తన గెలుపు ఖాయమని మమతా చెప్పుకుంటున్నారు.