లోకసభ ఎన్నికలు: రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక లేఖలు
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఓ లేఖ రాసింది. అధికారుల నియామకాలపై సూచనలు చేసింది. త్వరలో లోకసభతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లేఖ రాసింది.
పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో సూచనలు చేసింది. అధికారులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వరాదని ఎన్నికల సంఘం సూచించింది. గత నాలుగేళ్లలో వరుసగా మూడేళ్ల పాటు పని చేసిన జిల్లాల్లో ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించరాదని పేర్కొంది.

2019 మార్చి 31 వరకు ఒకే జిల్లాలో పదవీకాలం మూడేళ్ల పూర్తవ్వనున్న ఉద్యోగులకు సదరు జిల్లాలో పోస్టింగ్ ఇవ్వరాదని తెలిపింది. 2017 మే 31కి ముందు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన జిల్లాల్లో.. డీఈవో, ఆర్వో, ఏఆర్వో, ఎస్సైలకు తిరిగి పోస్టింగ్లు ఇవ్వరాదని పేర్కొంది.
అంతేకాదు, అధికారులు కూడా ఓ డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొంది. పోటీ చేస్తున్న ఏ అభ్యర్థితో తమకు సంబంధం లేదని, బంధువులు కాదని, తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని కూడా డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపింది. 2019లో లోకసభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ లేఖలు రాసింది.












Click it and Unblock the Notifications