అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రయోగం- ఇంట్లో నుంచే ఓటు వేసే ఛాన్స్..!!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవ్వాళ కర్ణాటకలో పర్యటించారు.
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ- ప్రచార వేడి పతాక స్థాయికి చేరకుంటోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందిక్కడ. ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలకు పదును పెడుతున్నాయి. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

రేపు మళ్లీ కర్ణాటకకు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే కర్ణాటకకు వచ్చిన విషయం తెలిసిందే. శివమొగ్గలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. మరోసారి ఆయన కర్ణాటకకు రానున్నారు. ఆదివారం మైసూరుకు రానున్నారాయన. బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని ప్రారంభించనున్నారు. దీనితో పాటు 16,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకం..
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలను నిర్వహిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గె సొంతం రాష్ట్రం కావడం వల్ల.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

చీఫ్ కమిషనర్ టూర్..
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కర్ణాటకలో పర్యటిస్తోన్నారు. ఆయన వెంట అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్, ఇతర అధికారులుఉన్నారు. ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మనోజ్ కుమార్ మీనాతో భేటీ అయ్యారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. సమస్యాత్మక, సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

మే 24 వరకు..
అనంతరం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. మే 24వ తేదీ వరకు రాష్ట్ర అసెంబ్లీకి గడువు ఉందని, ఈ లోపే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా తాము పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందనేది తరువాత తెలియజేస్తామని తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచాలనేదే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వయోధిక వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు.. వారు కోరుకుంటే ఇంట్లో నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. ఇంట్లో నుంచే ఓటు వేయదలిచిన వారు 12డీ ఫామ్ ను ఎన్నికల అధికారులకు అందజేయాల్సి ఉంటుందని, నోటిఫికేషన్ వెలువడిన తరువాత అయిదు రోజుల్లో ఈ ఫామ్ 12డీ అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications