పోలింగ్ బూత్లల్లో ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవ్వాళ్లితో తెరపడనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ షెడ్యూల్ అయింది. మొత్తం 224 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇందులో భాగంగా- ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రయోగాత్మకం. బెంగళూరు ప్యాలెస్ రోడ్లోని రామ్ నారాయణ్ చెల్లారామ్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 2లో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీని అమలు చేయనున్నారు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే ఓటర్లు ముందుగా చునావణ యాప్ (Chunavana app)ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

తమ ఓటరు గుర్తింపు కార్డ్, మొబైల్ ఫోన్ నంబర్ను రిజిస్టర్ చేయించుకోవాలి. ఓటీపీని ఎంట్రీ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం సెల్ఫీ ఫొటోను ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ ఫొటో ఈసీ డేటాబేస్లో రికార్డవుతుంది. పోలింగ్ బూత్కు చేరుకున్న తరువాత ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా స్కానింగ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈసీ డేటాబేస్లో రికార్డయిన ఫొటోతో స్కానింగ్ వెరిఫికేషన్ సరిపోతే నేరుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
దీనికి అదనంగా ఇక ఎలాంటి డాక్యుమెంట్లను కూడా ఓటర్లు- ఎన్నికల సిబ్బందికి అందజేయాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల నకిలీ ఓటర్లను అరికట్టినట్టవుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చోవాల్సిన అవసరం రాదని అధికారులు చెబుతున్నారు. గతంలో శివాజీనగర అసెంబ్లీ నియోజకవర్గంలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, ఇప్పుడు మరింత దీన్ని అభివృద్ధి చేసినట్లు వివరించారు.

ఇదిలావుండగా- ఈ సాయంత్రానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి రోజు కావడం వల్ల అన్ని పార్టీలు తమ ప్రచార తీవ్రతను పెంచాయి. ప్రచారం ముగిసిన అనంతరం స్థానికేతరులెవ్వరూ ఆయా నియోజకవర్గాల్లో ఉండకూడదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇదివరకే ఆదేశాలను జారీ చేశారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా ఉంచారు. దీనికోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications