Byju'sపై ఈడీ కొరడా- డిజిటల్ డేటా సీజ్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార తీవ్రతను పెంచాయి. విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇదివరకు బెంగళూరు, ఇతర నగరాల్లోని ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు సాగించారు. ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బైజూస్ కార్యాలయాలపై దాడులు చేశారు. విస్తృతంగా సోదాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను సీజ్ చేశారు.

బెంగళూరులో మొత్తం మూడు ప్రాంతాల్లో గల బైజూస్ కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందరన్ బైజూస్ నివాసంపైనా ఈడీ అధికారులు దాడులు చేసినట్లు చెబుతున్నారు. బైజూస్ మాతృసంస్థ థింక్ అండ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు రవీందరన్ సీఈఓగా వ్యవహరిస్తోన్నారు. ఈ కంపెనీ కిందే బైజూస్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కొనసాగుతోంది.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఫెమా నిబంధనలను బైజూస్ సంస్థ యాజమాన్యం ఉల్లంఘించినట్లు సమాచారం. 2011- 2023 మధ్యకాలంలో బైజూస్లో 28,000 కోట్ల రూపాయల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నమోదయ్యాయి. అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో 9,754 కోట్ల రూపాయలను వివిధ విదేశీ సంస్థలకు పంపించినట్లు గుర్తించారు ఈడీ అధికారులు.
ఇందులో వాణిజ్య ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో సుమారు 944 కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు చూపించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బైజూస్ యాజమాన్యం ఖాతాలను ఆడిట్ చేయలేదని, అందుకే ఈ సంస్థ యాజమాన్యం ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ దాడులు నిర్వహించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications