ఫ్యామిలి ఫ్యామిలీ మొత్తం ఈడీ గుప్పిట్లో- సోనియా అల్లుడికి సమన్లు: రేపే..
Robert Vadra: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుటుంబం మొత్తానికీ షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వీళ్లద్దరి పేర్లను ఛార్జ్షీట్లో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలో కొరడా ఝుళిపించింది. ప్రముఖ వ్యాపారవేత్త, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
గుర్గావ్ ల్యాండ్ కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు రాబర్ట్ వాద్రా. ఈ కేసులో నేడు ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. సుమారు ఏడుగంటల పాటు ఈ విచారించారు. గుర్గావ్ ల్యాండ్ స్కామ్కు సంబంధించిన పలు ప్రశ్నలను సంధించారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈ విచారణ కొనసాగింది.

ఈ సందర్భంగా సంతృప్తికర వివరణలు, సమాధానాలు రాలేదని ఈడీ అధికారులు భావించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి సమన్లు జారీ చేశారు. బుధవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చిన కొద్దిసేపటికే ఈ సమన్లు జారీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నేటి విచారణ ముగిసిన అనంతరం రాబర్ట్ వాద్రా విలేకరులతో మాట్లాడారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చానని, దీనికి ఓ ముగింపు వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. దేశం ఎదుర్కొంటోన్న సమస్యల గురించి ప్రశ్నించినప్పుడల్లా ఈడీ అధికారులు తనకు సమన్లు జారీ చేస్తుంటారని వ్యాఖ్యానించారు. ఇదంతా బీజేపీ ప్రతీకార రాజకీయాల్లో భాగమని విమర్శించారు.
ఈడీ ముందు ఇదివరకు తాను ఎన్నోసార్లు హాజరయ్యాననని, ఇందులో తనను ప్రశ్నించడానికి ఏమీ లేదని వాద్రా అన్నారు. అక్రమాలను గుర్తించడానికి 20 సంవత్సరాల సమయం పడుతుందా అని ప్రశ్నించారు. తనకు ఇప్పటివరకు 15 సార్లు సమన్లు వచ్చాయని, 23,000 డాక్యుమెంట్లను సమర్పించానని గుర్తు చేశారు.
అటు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ అధికారులు ఛార్జిషీట్లో చేర్చారు. గతంలో వారిద్దరూ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. 661 కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ ఇటీవలే ఈడీ నోటీసులు జారీ చేసింది కూడా.












Click it and Unblock the Notifications