ఫ్లిప్కార్ట్కు ఈడీ నోటీసు, వెయ్యి కోట్ల జరిమానాకు ఛాన్స్
న్యూఢిల్లీ: ది బిగ్ బిలియన్ డే సేల్ పేరుతో పెట్టిన ఆఫర్ల నేపథ్యంలో ఈ-కామర్స్ జెయింట్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై వివరణ కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు పంపించింది. ఈ సంస్థకు ఈడీ రూ.1,000 కోట్ల వరకు జరిమానా విధించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఫ్లిప్కార్ట్ ది బిగ్ మిలియన్ డే సేల్ అంశంపై చాలా ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చెప్పారు. ది బిగ్ మిలియన్ డే సేల్ పైన ఫ్లిప్కార్ట్ నుండి వివరణ కోరుతామని ఆమె అప్పుడు తెలిపారు. ఇప్పుడు ఈడీ ఫ్లిప్కార్ట్కు నోటీసులు పంపించింది.
కాగా, గతవారం భారీ తగ్గింపు అమ్మకాలతో ఫ్లిప్కార్ట్ పలు ఉత్పత్తులను పెట్టింది. దానికి ది బిగ్ బలియన్ డేగా పేర్కొంది. అయితే, ఇది వినియోగదారుల్ని నిరుత్సాహానికి గురి చేసింది. వారం రోజుల క్రితం (గత సోమవారం) ఉదయం 8 గంటలకు ఈ కొత్త స్కీం ప్రారంభం కాగానే లక్షలాది మంది వినియోగదారులు తమ ఆర్డర్లతో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్కు పోటెత్తారు.
భారీగా డిస్కౌంట్ ప్రకటించడంతో ఆర్డర్లను బుక్ చేసుకుందామని అనుకున్న వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ చికాకు తెప్పించింది. అందుకు కారణం ఫ్లిప్కార్ట్ సర్వర్లు. ఒక్కసారిగా లక్షల మంది ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ద్వారా ఆర్డర్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా సర్వర్లు మొరాయించాయి.
దీని పైన ఫ్లిప్కార్ట్ క్షమాపణలు కూడా కోరింది. ది బిగ్ బిలియన్ డే ద్వారా వినియోగదారులను సంతృప్తి పరచడంలో విఫలమయ్యామని, అనుకున్నస్థాయిలో పనితీరును కనబర్చలేకపోయామని ఈ దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ప్లిఫ్కార్డ్ నాడు అంగీకరించింది.
ఇందుకుగాను ప్రతి ఒక్క వినియోగదారుడికి క్షమాపణ చెబుతున్నట్లు తెలిపింది. మరోసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించదలిస్తే పూర్తి సన్నద్దతతో చేస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయమై ఫ్లిప్కార్డ్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ వినియోగదారులకు ఇ-మెయిల్ పంపారు.
ఫ్లిప్కార్ట్ దసరా పండగ నేపథ్యంలో ప్రవేశపెట్టిన డిస్కౌంట్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత బుధవారం తెలిపారు.
చాలామంది ఆందోళన వ్యక్తం చేశారని, దీనిపై తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నామని ఒక వేళ ప్రత్యేక విధానం లేక ఈ-కామర్స్ రిటైల్ వ్యాపారంపై స్పష్టత అవసరమా? అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.