ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసు: చిదంబరంను ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబందించి గతంలో ఆగస్టు 7 వరకు పాటియాల హౌస్ కోర్టు చిదంబరంకు మధ్యంతర ఊరట ఇవ్వగా.. తాజాగా ఆయన ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో చిదంబరం ముందస్తు బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ జులై 10న ఈడీ బదులిచ్చింది. చిదంబరానికి ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వాస్తవాలు వెలుగుచూడటం సాధ్యం కాదని ఈడీ పేర్కొంది.
ఇదిఇలావుంటే, ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం సహా 18మంది నిందితులపై జులై 19న సీబీఐ ఢిల్లీ కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ అప్పీల్ను పాటియాలా హౌస్ కోర్టు విచారిస్తోంది.
2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో మాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ కంపెనీకి 800 మిలియన్ డాలర్ల(రూ.3,500కోట్లకుపైగా) మేర విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్ఐపీబీ) అనుమతులు జారీ చేసింది.
కానీ, నిబందనల ప్రకారం విదేశీ పెట్టుబడులు రూ.600కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి అనుమతుల్ని ఎలా జారీ చేశారన్న విషయంపై సీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి.