తమిళనాడు డీల్ క్లోజ్: పన్నీర్ సెల్వం సీఎం: ఢిల్లీకి ఎడప్పాడి పళనిసామి !
అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు విలీనంలో భాగంగా జరిగిన చర్చల్లో పన్నీర్ సెల్వం ను మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలని, ఎడప్పాడి పళనిసామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఇరు వర్గాలు నిర్ణయించాయ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు విలీనంలో భాగంగా జరిగిన చర్చల్లో పన్నీర్ సెల్వం ను మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలని ఇరు వర్గాలు నిర్ణయించారని సమాచారం.
ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిసామిని వీలైనం త్వరగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలనే ప్రతిపాదనకు ఆ పార్టీ నాయకుల నుంచి ఎక్కువ మద్దతు లభించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అయ్యే వరకు ఎడప్పాడి పళనిసామిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని ఇరు వర్గాల నాయకులు తీర్మానించారని సమాచారం.
కనీసం రెండు మూడు నెలలు
ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఉన్నారు. ఇప్పటికిప్పుడే ఎడప్పాడి పళనిసామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చెయ్యడం సాధ్యం కాదని నాయకులే చెబుతున్నారు. కనీసం రెండు మూడు నెలల తరువాత పళనిసామి అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్మదర్శి అయ్యే అవకాశం ఉంది.
ముందు మేడం శశికళ కథ
గతంలో ఎడప్పాడి పళనిసామి వర్గం తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ను ఎన్నుకున్నామని ఎన్నికల కమిషన్ కు లేఖ ఇచ్చింది. ఇప్పుడు ఆ లేఖను వెనక్కి తీసుకుని శశికళ నటరాజన్ ను పార్టీ పదవి నుంచి తప్పించాలి.
ఆమెను తప్పించి ఎన్నికలకు
శశికళను తప్పించిన తరువాత అన్నాడీఎంపీ పార్టీ అంతర్గత ఎన్నిక నిర్వహించి అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళనిసామిని ఎన్నుకోవాలి. అప్పటి వరకు ఎడప్పాడి పళనిసామికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారని సమాచారం.
దాదాపు మంత్రులు అందరూ
ఇప్పటి వరకూ ఉన్న మంత్రివర్గాన్ని ఇంచుమించు యథాతథంగా కొనసాగించాలని ,తరువాత మార్పులు చేర్పులు చెయ్యాలని చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొంత వరకు తగ్గించాలని నిర్ణయించారు.
రెండాకుల చిహ్నంతో ప్రజల్లోకి
త్వరలో తమిళనాడులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వర్గాలు ఒక్కటిగా రెండాకుల చిహ్నంతో పోటీ చెయ్యాలని, తద్వారా అమ్మ జయలలిత వారసత్వం పూర్తిగా తమకే ఉందనే విషయాన్ని ప్రజల్లో నిరూపించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించారని సమాచారం.
ఎన్నికల కమిషన్
వీలైనంత త్వరగా ఇరు వర్గాలు విలీనానికి సంబంధించిన లేఖలు ఎన్నికల కమిషన్ కు ఇచ్చి, అంతా కలిసి ఒకే వర్గంగా రెండాకుల చిహ్నం తీసుకుంటే మంచిదని పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు అడుగులు వేస్తున్నారని సమాచారం.
ఢిల్లీ సీఎం పళనిసామి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఢిల్లీకి బయలుదేరడానికి సిద్దం అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ కార్యాక్రమానికి హాజరుకానున్నారు. వీలైతే కేంద్రంలోని పెద్దలతో చర్చించి మళ్లీ చెన్నై చేరుకోవాలని పళనిసామి నిర్ణయించారు.