18 వేల అడుగుల ఎత్తులో.. కూలిపడ్డ మంచుగడ్డ... చిక్కుకున్న సైనికులు
సియాచిన్ గ్లేసియర్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇక్కడ విధులు నిర్వహించడం అంటే మమూలు విషయం కాదు. మైనస్ ఉష్ణోగ్రతల్లో కూడా సైనికులు గస్తీ కాస్తున్నారు. అయితే సోమవారం ఓ మంచుగడ్డ పడి సైనికులు చిక్కుకోవడం కలకలం రేపింది.
హిమాలయాల ఉత్తర అంచున ఉన్న హిమానీనదం ఒక్కసారిగా కూలి పడింది. అయితే అక్కడ సైనికులు గస్తీ కాస్తున్నారు. మంచు గడ్డ పడటంతో దాదాపు ఎనిమిది మంది మంచు కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే సైనికులు సహాయ కార్యక్రమాలను చేపట్టారు. సైనికులు చిక్కుకున్న ప్రాంతం 18 వేల అడుగుల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంత పరిసరాలు 22 వేల అడుగుల ఎత్తువరకు ఉంటాయని పేర్కొన్నారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలా మంచుగడ్డలు కూలిపడి సైనికులు చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. 1984లో భారత్తోపాటు పాకిస్థాన్ కూడా మంచుగడ్డలు కూలి సైనికులను కోల్పోయింది. ఈ విషయాన్ని అధికారులు గుర్తుచేశారు.
2016 ఫిబ్రవరిలో మంచుగడ్డ పడిపోయి దాదాపు 10 మంది సైనికులు చనిపోయిన ఘటన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఆ సమయంలోనే లాన్స్ నాయక్ హనుమంతప్ప కోప్పాడ్ 25 ఫీట్ల మంచులో ఇరుక్కున సంగతి తెలిసిందే. దాదాపు ఆరురోజులు మృత్యువుతో పోరాడి చివరికి ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆసువులు బాసారు. హనమంతప్పతోపాటు 10 మంది సైనికులు ఫిబ్రవరి 3వ తేదీన సోనమ్ పోస్ట్ వద్ద గస్తీ కాస్తుండగా మంచు పెళ్ల వారిపై పడింది. అదీ దాదాపు 20 వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికక్కడే 9 మంది చనిపోగా.. హనుమంతప్ప మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.