మహారాష్ట్ర సంక్షోభం సుప్రీంకోర్టుకు: అనర్హత నోటిసులపై ఏక్నాథ్ షిండే, 27న విచారణ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. అసెంబ్లీలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండేను కాకుండా శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే సూచించిన వ్యక్తిని గుర్తించడం పట్ల షిండే నేతృత్వంలోని రెబల్ గ్రూప్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అనర్హత నోటిసులపై సుప్రీంకోర్టుకు ఏక్నాథ్ షిండే వర్గం
డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతోపాటు శివసేన తరపున శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని కూడా ఏక్ నాథ్ షిండే క్యాంపు సవాల్ చేసింది. కేవలం 15 మంది మద్దతున్న వ్యక్తి పార్టీ శాసనసభాపక్ష నేత కాలేరని స్పష్టం చేసింది షిండే క్యాంపు. ఎమ్మెల్యేలుగా అనర్హతకు సంబంధించి ఇచ్చిన నోటీసులకు జూన్ 27వ తేదీ సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలని తిరుగుబాటు నేత షిండే సహా 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ శనివారం సమన్లు జారీ చేశారు. దీనిపైనా రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
సుప్రీంకోర్టుకు ఏక్నాథ్ షిండే వర్గం అభ్యర్థన ఇదే
అనర్హత పిటిషన్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్ను ఆదేశించాలని తిరుగుబాటుదారులు సుప్రీంకోర్టును కోరారు. తమకు మరింత సమయం ఇవ్వాలన్నారు. తమ కుటుంబాలకు భద్రత కల్పించేలా చర్యలు కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేపీ పర్దివాలా సభ్యులు గల బెంచ్ సోమవారం(జూన్ 27న) పరిశీలించనుంది.
ఏక్నాథ్ షిండే క్యాంపునకు ఎమ్మెల్యేల వలస
కాగా, ఏక్ నాథ్ సిండే క్యాంపులో తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో మంత్రి కూడా గౌహతిలోని షిండే క్యాంపునకు చేరారు. దీంతో షిండే క్యాంపులో 50 మందికిపైగా ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ థాక్రే వర్గం బుజ్జగింపులు, బెరింపులకు పాల్పడినా రెబల్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదు. కాగా, 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్రం వై కేటగిరి సెక్యూరిటీ కల్పించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర గవర్నర్ కూడా రెబల్ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. మహారాష్ట్రలో శాంతిభద్రతల కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధిస్తున్నారు పోలీసులు. మరోవైపు, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.