ఏక్నాథ్ షిండేది బాలాసాహెబంచి శివసేన పార్టీ: ఉద్ధవ్ థాక్రే పార్టీకి ‘కాగడా’ గుర్తు
ముంబై: శివసేన పార్టీ చీలిక వర్గాల(ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే)కు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ పేర్లు కేటాయించింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి 'కాగడా' గుర్తును కేటాయిస్తూ ప్రకటన వెలువరించింది. 'శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పేరును థాక్రే వర్గానికి కేటాయించింది.
మరోవైపు, 'బాలాసాహెబంచి శివసేన' అన్న పేరును మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది ఈసీ. కొత్త ఎన్నికల గుర్తు ఎంచుకోవాలని ఆ వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాలు కోరినట్లు 'త్రిశూలం', 'గద' గుర్తులను కేటాయించేందుకు ఈసీ నిరాకరించింది. ఇవి మతపరమైన గుర్తులను ప్రతిబింభిస్తున్న నేపథ్యంలో వాటిని పక్కనబెట్టినట్లు స్పష్టం చేసింది.
'శివసేన' పేరు, ఆ పార్టీ గుర్తు అయిన ధనస్సు-బాణంను ఎన్నికల సంఘం స్తంభింప చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు కొత్త పేర్లు, పార్టీకి గుర్తులకు సంబంధించి ఐచ్ఛికాలు సమర్పించాలని ఇది వరకే ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఇరు పార్టీ ఇరువర్గాలు తమకు కేటాయించాల్సిన గుర్తులపై ఐచ్ఛికాలను ఈసీకి సమర్పించాయి.
త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఆదివారం కోరింది. ఇక షిండే వర్గం కూడా తమ ఐచ్ఛికాలను సమర్పించినట్లు ఈసీ అధికారులు తెలిపారు. పార్టీ గుర్తుగా 'గద'ను కేటాయించాలని షిండే వర్గం కోరినట్లు.. తాజా ఈసీ ప్రకటనను బట్టి అర్థమవుతోంది. త్రిశూలం, గదను కేటాయించకపోవడంతో మరిన్ని ఐచ్ఛికాలను సూచించాలని షిండే వర్గం ఈసీని కోరింది.
ఇది ఇలావుండగా, శివసేన పేరు, గుర్తును స్తంభింపజేయడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ గుర్తు, పేరును నిలిపివేస్తూ ఈసీ అక్టోబర్ 8న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. పార్టీల వాదనలు వినకుండానే చట్టవిరుద్ధంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ఉద్ధవ్ థాక్రే వర్గం వాదించింది. ఈ పిటిషన్లో ఎన్నికల సంఘం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేలను ప్రతివాదులుగా చేర్చింది.