ఐదు రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయ పార్టీలకు ఈసీ ఊరట-ప్రచార ఆంక్షల సడలింపు
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొంటున్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈ మేరకు గతంలో విధించిన ఆంక్షల్ని సడలిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతుండటం, రాజకీయపార్టీలు ప్రచారం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రోజువారీ కోవిడ్ -19 కేసుల తగ్గుదలతో, ఐదు రాష్ట్రాలలో రెండవ దశ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు ప్రచార నిబంధనలలో సడలింపులను ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పరిమితుల ప్రకారం అనుమతించబడిన వ్యక్తుల కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన పాదయాత్రకు అనుమతించాలని నిర్ణయించారు. జిల్లా అధికారుల ముందస్తు అనుమతితో పాదయాత్రలు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది.
ప్రచార సమయాలపై నిషేధం గతంలోలా రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు కాకుండా రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల మధ్య ఉంటుంది. రాజకీయ పార్టీలు/అభ్యర్థులు విపత్తు నిర్వహణ అధారిటీ అన్ని మార్గదర్శకాలు, ప్రోటోకాల్లను అనుసరించి ఉదయం 6 నుండి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. రాజకీయ పార్టీలు/అభ్యర్థులు తమ సమావేశాలు, ర్యాలీలను అనుమతించిన బహిరంగ ప్రదేశాల సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం వరకు లేదా విపత్తుల అథారిటీ సూచించిన పరిమితిలో ఏది తక్కువైతే దాని ప్రకారం నిర్వహించుకోవచ్చు.
ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిని ఈసీ సమీక్షిస్తోంది. కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్తో ఈసీ సమీక్ష సమావేశం నిర్వహించింది. సమీక్షా సమావేశంలో, కోవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, దేశంలో కేసులు వేగంగా తగ్గుతున్నాయని ఓ అంచనాకు వచ్చారు.