మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీల్లో మార్పు-ఈసీ కీలక నిర్ణయం-కొత్త తేదీలివే
ఈ నెలలో జరగాల్సిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీల్లో ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ మార్పులు చేస్తూ ఎన్నికల సంఘం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త తేదీలు ఇలా ఉన్నాయి.
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్ధానాలున్నాయి. వీటికి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం గతంలో షెడ్యూల్ ప్రకటించింది. తొలిదశ ఎన్నికలు ఈ నెల 27న జరగాల్సి ఉంది. వీటిని తాజాగా ఈ నెల 28కి మారుస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే రెండో దశ ఎన్నికలు గతంలో ఇచ్చిన షెడ్యూల్ మేరకు వచ్చే నెల 3న జరగాల్సి ఉంది. వీటిని మార్చి 5న నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో జరిగే రెండు దశల ఎన్నికల్లో మొత్తం 20 లక్షల 56 వేల 901 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది.

ఫిబ్రవరి 27న జరగాల్సిన తొలిదశ ఎన్నికలకు ఆదివారం రోజు పోలింగ్ వచ్చింది. దీంతో ఆ రోజు చర్చిలకు వెళ్లేందుకు తమకు ఇబ్బంది ఉంటుందని మణిపూర్ లోని పలు గిరిజన ప్రజలు ఈసీ దృష్టికి తెచ్చారు. అలాగే స్ధానిక రాజకీయ పార్టీలు కూడా ఈ మేరకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఎన్నికల సంఘం పోలింగ్ తేదీల్ని మార్చింది. మణిపూర్ లో ఉన్న 30 లక్షల మంది జనాభాలో 41 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. దీంతో వీరిని దృష్టిలో ఉంచుకుని ఆల్-మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనేజైషన్ (ఏఎంసీఓ) ఎన్నికల్ని వాయిదా వేయాలని జనవరి 18న ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో పాటు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications