అవాస్తవ ఆరోపణలు: మమతా బెనర్జీపై చర్యలు తప్పవంటూ ఎన్నికల సంఘం హెచ్చరిక
న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత వారం నందిగ్రామ్లోని పోలింగ్ బూత్లో పోలింగ్కు అంతరాయం కలిగిందన్న మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టివేసింది.
మమతా బెనర్జీ వ్రాతపూర్వక ఫిర్యాదు 'వాస్తవంగా తప్పు' నిరాధారమైనదని పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆమెపై ప్రవర్తనా నియమావళి, ప్రజల ప్రాతినిధ్య చట్టం సంబంధిత విభాగాల క్రింద చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడం, రాష్ట్ర డీజీపీని మార్చడం లాంటి చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకే ఎన్నికల సంఘం తీసుకుందని మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. మమత ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలు చేసిన ఆమెపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
నందిగ్రాంలో మమతా బెనర్జీ తన ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారితో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మమతపై 50వేల మెజార్టీతో గెలుస్తానని సువేందు అధికారి చెబుతుండగా, గెలుపు తనదేనని టీఎంసీ అధినేత్రి చెప్పుకుంటున్నారు. నందిగ్రాంలో ఎన్నికల పోలింగ్ ను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని మమత ఆరోపించారు.
జడ్ ప్లస్ భద్రత పొందుతున్న మమతా బెనర్జీ ఎన్నికల సమయంలో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య ఘర్షణల కారణంగా ఒక గదిలో ఉండిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలు ఆమెను అక్కడ్నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని మమత ఆరోపించారు. ఏప్రిల్ 1న ఎన్నికల సంఘంపై 63 ఫిర్యాదులు చేశారు మమతా బెనర్జీ. అంతేగాక తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మమతా బెనర్జీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సక్రమంగా సాగుతోందని, లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించేలా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని మండిపడింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎన్నికల సంఘంపై అవాస్తమైన ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. మీడియా కూడా తప్పుడు కథనాలను ప్రచారం చేయొద్దని హితవు పలికింది. నందిగ్రాంలో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 1న జరిగిన వ్యవహారంపై ప్రత్యేకంగా విచారణ జరుపుతామని పేర్కొంది. పోలింగ్ కేంద్రం వద్ద కోడ్ ఉల్లంఘించినందుకు భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని మమతను ఉద్దేశించి తేల్చి చెప్పింది.