ఇంట్రెస్టింగ్ ఫార్ములా : ఉచిత పథకాలపై కేజ్రీ థియరీ... ప్రజలు మోసపోరన్న విపక్షాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. ప్రచార సమయాల్లో పార్టీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆ పథకాల వెనక ఉన్న ఎకనామిక్స్ను వివరించారు సీఎం కేజ్రీవాల్.
ఉచిత పథకాల వెనక కేజ్రీ థియరీ
ఉచితంగా పరిమితితో కూడిన కొన్ని పథకాలు ఇవ్వడం ఆర్థిక వ్యవస్థకు మంచిదే అన్నారు. ఇలాంటి కొన్ని ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల పేదల దగ్గర డబ్బులు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. దీంతో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ఇచ్చే పథకాలపై అధిక పన్నులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఇలాంటి పథకాలతో రాష్ట్రం లోటు బడ్జెట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలని అన్నారు. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ ట్విటర్లో ట్వీట్ చేశారు.

కేజ్రీవాల్ మాటలకు ప్రజలు మోసపోరు
నీళ్లు, విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెబుతున్న కేజ్రీవాల్ మాటలకు ప్రజలు మోసపోరని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికలు సురక్షితం అభివృద్ధి అనే ప్రధాన అంశాలపైనే ఓటర్ల తీర్పు ఇస్తారు తప్ప... కేజ్రీవాల్ సర్కార్ చెబుతున్న ఉచిత పథకాలపై కాదని మనోజ్ తివారీ చెప్పారు. ఉచిత కరెంటు, ఉచిత నీరు ఢిల్లీ వాసులకు ఇస్తామని కేజ్రీవాల్ సర్కార్ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు మనోజ్ తివారీ. ఢిల్లీలో అర్హులైన వారికి ఉచితంగా నీటి సరఫరా చేయడం అసాధ్యమన్నారు తివారీ. ఇక ఇప్పటి వరకు ఉచిత విద్యుత్పై ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఎలాంటి పథకం ప్రవేశపెట్టలేదని మండిపడ్డ మనోజ్ తివారీ... ఓట్ల కోసమే ఎన్నికల ముందు ఉచిత విద్యుత్ నినాదం కేజ్రీ సర్కార్ అందుకుందని ఫైర్ అయ్యారు.

ఉద్యోగాలు, పక్కా ఇళ్లు ఇవ్వండి చాలు..
కేజ్రీవాల్ ఉచిత హామీలపై మరో ప్రత్యర్థి కాంగ్రెస్ కూడా మండిపడింది. ఉచితంగా పథకాలు ఇచ్చే బదులు ఢిల్లీ వాసులకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు ఉండేలా కేజ్రీవాల్ సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఆప్ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత అల్కా లాంబా. ఎన్నికల్లో ఓట్లు కోసమే ఉచితంగా పథకాలను కేజ్రీవాల్ ప్రకటిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కానీ ప్రజల దగ్గరకు వెళితే ఉచిత పథకాలు తమకు వద్దని , వారికి ఇళ్లు, ఉద్యోగాలు కావాలని చెబుతున్నట్లు అల్కా లాంబా చెప్పారు. ఇవి ప్రజలకు చేయగలిగితే వాటర్ మరియు కరెంటు బిల్లు వారే చూసుకుంటారని అల్కా లాంబా చెప్పారు.

అవినీతి అంతంతో మిగిలిన డబ్బులే పథకాలకు ఖర్చు
ఇక 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని నెరవేరుస్తామని ఆప్ సర్కార్ చెబుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు ఉండవు, ఉచిత వైఫై. సీనియర్ సిటిజెన్లకు ఉచిత తీర్థయాత్రలు, కొత్త నీటి కనెక్షన్లకు డెవలప్మెంట్ ఛార్జీల రద్దు వంటివి ఇప్పటికే కేజ్రీవాల్ సర్కార్ అమలు చేస్తోంది. అయితే ఎలాంటి పన్నులు పెంచకుండా ఉచిత పథకాలు ఇచ్చామని గతంలో కేజ్రీవాల్ చెప్పారు. అంతేకాదు బడ్జెట్లో మిగులు నిధులు ఉంచామని కూడా వెల్లడించారు. అవినీతిని అంతం చేయడం ద్వారా మిగిలే డబ్బులనే ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాలపై ఖర్చుచేయడంలో తప్పులేదని అన్నారు.












Click it and Unblock the Notifications