ఎనర్జీ డ్రింక్ గ్లూకాన్-డీ లో పురుగులు: ఆస్పత్రి పాలు
ఉత్తరప్రదేశ్: ఎనర్జీ డ్రింక్ గ్లూకాన్-డీ లో పురుగులు ఉన్న విషయం బయటపడటంతో ఉత్తరప్రదేశ్ వాసులు హడలిపోయారు. ఒక కుటుంబంలోని కొందరు గ్లూకాన్-డీ తాగి ఆసుపత్రి పాలైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని బులందర్ షార్ లో బబ్లూ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను రెండు రోజుల క్రితం బులందర్ షార్ లోని ఒక జనరల్ స్టోర్ లో గ్లూకాన్- డీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్లాడు. తరువాత నీటిలో గ్లూకాన్- డీ కలుపుకుని కుటుంబ సభ్యులు సేవించారు.
కొంత సేపటి తరువాత కుటుంబ సభ్యులు అందరికి వాంతులు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డ్రగ్ సేఫ్టీ అధికారి శివదాస్ సంఘటనా స్థలానికి చేరుకుని గ్లూకాన్-డీ ని స్వాధీనం చేసుకుని లేబరేటరికి పంపించారు.
గ్లూకాన్-డీ లో చిన్నచిన్న పురుగులు ఉన్న విషయం బయటపడింది. వెంటనే జనరల్ స్టోర్ లోని నాలుగు గ్లూకాన్-డీ ప్యాకెట్లు స్వాదీనం చేసుకుని లక్నోలోని ప్రయోగశాల కు పంపించారు. గ్లూకాన్- డీ ఉత్పత్తులను అమెరికన్ ఫార్మాస్యూటికల్, హెచ్ జే హీంజ్ కంపెనీలు తయారు చేసిందని అధికారులు చెప్పారు.
ప్రయోగశాల నుండి నివేదిక వచ్చిన తరువాత గ్లూకాన్-డీ అమ్మాకాలను కొనసాగించాలా, లేదా అని నిర్ణయం తీసుకుంటామని డ్రగ్ సేఫ్టీ అధికారి శివదాస్ తెలిపారు. మ్యాగీ నూడుల్స్ వివాదం మరిచిపోకముందే ఇప్పుడు గ్లూకాన్-డీ వివాదం తెరమీదకు వచ్చింది.