సచిన్ జోషిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు: రూ. 100 కోట్ల మనీలాండరింగ్ కేసు
ముంబై: తెలుగుతోపాటు బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన నటుడు సచిన్ జోషి అరెస్టయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, సచిన్ పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. అంతేగాక, ఆయన ఒక వ్యాపారవేత్త కూడా.
గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, డిఫాల్టర్ అయిన విజయ్ మాల్యాకు చెందిన బంగ్లాను సచిన్ జోషి కొనుగోలు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్, సచిన్ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ఏకంగా రూ. 100 కోట్ల మేర మనీలాండరింగ్ కు పాల్పడినట్లు సచిన్ జోషి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గతంలోనే విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
అయితే, విచారణకు సచిన్ జోషి హాజరుకాకపోవడంతో తాజాగా ఈడీ అధికారులు సచిన్ జోషిని అరెస్ట్ చేశారు. సౌత్ ముంబైలోని ఈడీ కార్యాలయంలో సచిన్ జోషిని ఓంకార్ రియల్టర్స్ కేసులో అధికారులు విచారిస్తున్నారు. ఈడీ అధికారులు ఇప్పటికే ఓంకార్ గ్రూప్ ఛైర్మన్ కమల్ గుప్తా, ఎండీ బాబు లాల్ వర్మను ఈ కేసులో అరెస్ట్ చేశారు.
గోవాలోని విజయ్ మాల్యాకు సంబంధించిన బంగ్లాను 2017లో రూ. 73 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఆదాయపుపన్ను శాఖ అధికారులు కూడా సచిన్ జోషికి చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు.
కాగా, సచిన్ జోషికి ముంబైలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, క్లబ్బులు ఉన్నాయి. మోడల్, నటి ఊర్వశి శర్మను సచిన్ వివాహం చేసుకున్నాడు. తెలుగు, కన్నడ, బాలీవుడ్లోనూ సచిన్ సినిమాలు చేశారు. పాన్ మసాలా, బ్రెవరీ, డిస్టిల్లరీస్ పరిశ్రమలు కూడా ఉన్నాయి.