సీఎం కావాలని: ఆరంగేట్రంపై భయంలేదన్న రజనీకాంత్
చెన్నై: తాను రాజకీయాల్లోకి వచ్చే అంశం తన చేతులలో లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం అన్నారు. లింగా ఆడియో విడుదల కార్యక్రమం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. ఈ సమయంలో పలువురు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. దీనిపై సూపర్ స్టార్ స్పందించారు. సినిమాలు కూడా ఓ రకమైన సర్వీస్ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలు అంటే భయం లేదన్నారు.
‘మీరందరూ ఇంత ప్రేమగా అడుగుతుంటే, ఇప్పటికీ నేను రాజకీయాల గురించి మాట్లాడకపోతే నాకు పొగరనుకుంటారు' అంటూ రాజకీయాల గురించి తన మనసులో మాటని రజనీకాంత్ బయటపెట్టారు.
దశబ్దాలుగా నాతో ఎంతో సన్నిహితంగా ఉండే వారందరూ కూడా ఇప్పటికీ రజనీ మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నామంటుంటారని, వాళ్లకే కాదు, నిజానికి నా గురించి నాకే తెలీదని, పరిస్థితుల్లో నేను ఒక వస్తువుని మాత్రమేనని, రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలీదని, రాజకీయం గురించి నాకూ తెలుసునని, దాని లోతు, ఎంత ప్రమాదకరమైనదో కూడా తెలుసునన్నారు.
రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొని ప్రజలకు మంచి చేయగలనా అనే ఆలోచిస్తున్నానని చెప్పారు. దేనికైనా మంచి మార్గం ఏర్పడాలన్నారు. రాజకీయాల్లోకి రావడానికి నేను భయపడడం లేదు, సందేహిస్తున్నానంతే అన్నారు.
రాజకీయాల్లోకి పోవడం సులభమేనని, కానీ, ప్రజలు ఎదురుచూసే విధంగా చెయ్యగలమా, లేదా అన్నది ముఖ్యమన్నారు. ప్రజలకి ఖచ్చితంగా మంచి చేస్తానని, కాకపోతే అది ఏదారిలో అన్నది ఆ పైవాడి నిర్ణయమేనంటూ రజనీకాంత్ పేర్కొన్నారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని, ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. అలాగే రజనీకాంత్ కోసం వివిధ పార్టీలు ఎప్పుడు క్యూలో ఉంటాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం పైన పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి.
ఇటీవల రజనీ రాజకీయ ఆరంగేట్రం పైన మరింత ఎక్కువగా ఊహాగానాలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ సూపర్ స్టార్ ఇంటికి వెళ్లి కలవడం చర్చకు దారి తీసింది. అలాగే, బీజేపీ కూడా ఆయనకు గాలం వేసినట్లుగా ప్రచారం సాగింది.
అయితే, రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం మాజీ ముఖ్యంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జయలలిత విడుదలైన సమయంలో ఆమెకు లేఖ రాసి బీజేపీకి షాకిచ్చారు. అదే సమయంలో రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టి రానున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. రజనీ పైన ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం లింగా ఆడియో విడుదల సమయంలో సినీ దర్శకుడు అమీర్ మాట్లాడుతూ.. రజనీ రాజకీయాల్లోకి వస్తే చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. రజనీ సార్ రాజకీయాల్లోకి రావాలని, ఆయనను సీఎంగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని చెప్పారు. లింగ దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా రజనీ రాజకీయాల్లోకి రావాలని అభిలాషించారు.