2018-2020... ఆ డేటా అత్యంత కీలకం... భారత్లో కరోనా ఎఫెక్ట్ వాస్తవాలు తెలియాలంటే...
దేశంలో ప్రతీరోజూ లక్షల్లో కోవిడ్ 19 కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకూ 18 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవగా 38,201 మంది కరోనాతో మరణించారు. దేశంలో కరోనా మొదటి కేసు జనవరి 30న నమోదవగా... మార్చి 13న తొలి మరణం నమోదైంది. మార్చి 13 నుంచి ఇప్పటివరకూ 38,201 మంది దేశంలో కరోనాతో మృతి చెందారు.
Recommended Video
అయితే 130 కోట్ల జనాభా ఉన్న భారత్లో ఈ మరణాల సంఖ్యను ఎలా చూడాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. సాధారణ రోజుల్లో భారత్లో ప్రతీ ఏటా సంభవిస్తున్న మరణాలను,2020లో కరోనా కారణంగా సంభవించిన మరణాలను పోల్చితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రానికి నిపుణుల లేఖ...
దేశంలోని 230 మంది హెల్త్ ప్రొఫెషనల్స్,ఎపిడెమాలజిస్టులు,సామాజిక కార్యకర్తలు కలిసి కేంద్రానికి ఓ లేఖ రాశారు. 2018,2019,2020ల్లో భారత్లో సంభవించిన మరణాల డేటాను విడుదల చేయాలని కోరారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే... సాధారణ రోజులతో పోలిస్తే కరోనా పరిస్థితుల్లో నమోదైన అదనపు మరణాలు ఎన్ని అన్నదానిపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. లేఖ రాసినవాళ్లలో ప్రముఖ ఎపిడెమాలజిస్టులు గౌతమ్ మీనన్,గిరిధర్ బాబు,మాజీ ఐసీఎంఆర్ చీఫ్ టి.జాకోబ్ జాన్ ఉన్నారు.

2018-2020.. ఆ డేటా కీలకం...
చరిత్రలో ఇంతకుముందెన్నడూ సివిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలు నమోదు చేసిన డేటా అంత ప్రాముఖ్యతను సంతరించుకోలేదని లేఖలో నిపుణులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనన, మరణ ధ్రువీకరణలను నమోదు చేసే రిజిస్ట్రేషన్ వ్యవస్థల సేవలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. 2018 నుంచి 2020 వరకు డెత్ డేటాను విడుదల చేయడం ద్వారా భారత్లో కోవిడ్ 19 ప్రభావాన్ని కచ్చితంగా విశ్లేషించవచ్చునని,అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించవచ్చునని చెప్పారు.

శాస్త్రీయపరమైన అవగాహన కోసం...
'కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా చాలా దేశాల్లో కీలకమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థలు డెత్ డేటాను అందుబాటులోకి తీసుకొచ్చాయి. భారత్లో కూడా ఈ డేటా అందుబాటులోకి తీసుకొస్తే... ఏయే ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించాలి.. ఎక్కడ టెస్టుల సంఖ్యను పెంచాలి... వైద్య శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా... వంటి విషయాలపై స్పష్టత వస్తుంది.' అని లేఖలో నిపుణులు పేర్కొన్నారు. కరోనా మరణాల రేటుపై ఇది కచ్చితమైన అవగాహనకు అవకాశం కల్పిస్తుందని... తద్వారా ప్రజల్లో వైరస్ వ్యాప్తికి సంబంధించి శాస్త్రీయమైన అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు. కాబట్టి కనీసం మూడేళ్ల డెత్ డేటాను పరిశీలించడం కీలకమన్నారు.

కరోనా మరణాల సంఖ్యపై మొదటి నుంచి అనుమానాలు...
మొదటినుంచి కరోనా మరణాల సంఖ్యకు సంబంధించిన కచ్చితత్వంపై నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తక్కువ టెస్టుల కారణంగా దేశంలో చాలావరకు కరోనా మరణాలు అధికారిక లెక్కల్లో చేరట్లేదని జూన్లో పలువురు నిపుణులు ఆరోపించారు. అయితే ఇది ఒక్క భారత్లోనే నెలకొన్న సమస్య కాదని.. ప్రపంచంలోని పలు దేశాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేవలం ఆ పేషెంట్ల పైనే దృష్టి సారించడం ద్వారా ఇతర రోగాలతో బాధపడుతున్న వేలాది మంది పేషెంట్లు సకాలంలో వైద్యం అందక చనిపోయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications