రెబెల్స్ క్యాంప్లో చేరేలా సంజయ్ రౌత్పై ఒత్తిళ్లు: తల తెగినా సరే..: ఫడ్నవీస్కు ట్యాగ్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న రాజకీయ సంక్షోభం ఇవ్వాళ కొత్త మలుపు తిరిగింది. ఏకంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గ నేతలు టార్గెట్ అయ్యారు. మొన్నటికి మొన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ తరహాలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పంజా విసిరారు. శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు సమన్లు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు.
కీలక నేతపై కన్ను..
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభ పరిస్థితులను నివారించడంలో సంజయ్ రౌత్.. కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ థాకరేకు ఆయన కుడిభుజంలా వ్యవహరిస్తోన్నారు. అధికార మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో కొనసాగుతోన్న శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ నేతలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వస్తోన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వాన్ని వహిస్తోన్న ఏక్నాథ్ షిండేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అస్సాం నుంచి జీవం లేకుండా వారు ముంబైకి చేరుకుంటారంటూ విమర్శలు గుప్పించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే..
ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పట్ర చాల్ భూ కుంభకోణం కేసు విషయంలో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. మంగళవారమే ఆయన ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పతాకస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్ధవ్ వర్గంలో కీలక నేతగా పేరున్న సంజయ్ రౌత్.. ఈడీ నుంచి సమన్లు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమన్లపై స్పందించిన సంజయ్..
ఈ నోటీసులపై సంజయ్ రౌత్ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులపై ఆరోపణలు గుప్పించారు. ఈడీ అధికారులు తనకు సమన్లను పంపించడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందంటూ మండిపడ్డారు. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని తిరుగుబాటు నాయకుల క్యాంప్లో చేరేలా తనపై ఒత్తిళ్లను తీసుకొస్తోన్నారని ధ్వజమెత్తారు. ఉద్దవ్ థాకరే తరఫున పోరాడుతున్న తనను యుద్ధం నుంచి తప్పించేలా ప్రయత్నాలు చేస్తోన్నారంటూ నిప్పులు చెరిగారు సంజయ్ రౌత్.
తల తెగినా సరే..
తల తెగినా సరే.. తాను తిరుగుబాటు నేతలతో కలిసే ప్రసక్తే ఉండబోదని సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు. షిండే క్యాంప్ మకాం వేసిన గువాహటి వైపు తాను వెళ్లది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. దీన్ని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ట్యాగ్ చేశారు. ఈడీ తనకు సమన్లను పంపించిన విషయం ఇప్పుడే తనకు తెలిసిందని, తాను అసలు సిసలు బాలా సాహెబ్ (బాల్ థాకరే) సైనికుడిని అన్నారు.