గడ్కరీ గారూ! అద్భుతమైన ప్రశ్న: బీజేపీకి రాహుల్ దిమ్మతిరిగే కౌంటర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని చెప్పిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
'అద్భుతమైన ప్రశ్న.. గడ్కరీ గారు, ప్రతి భారతీయుడు ఇదే ప్రశ్న అడుగుతున్నాడు' అని ట్వీట్ చేశారు. అయితే, రాహుల్ గాంధీ స్టార్టప్లు, ప్రయివేటు ఉద్యోగాల విషయం మరిచిపోయినట్లున్నారని, గడ్కరీ చెప్పింది కేవలం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల గురించి అని కొందరు నెటిజన్లు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా గడ్కరీ వ్యాఖ్యలపై స్పందించింది. నిజం మాట్లాడిన తొలి బీజేపీ మంత్రి నితిన్ గడ్కరీ అని కాంగ్రెస్ ఆయన్ను ప్రశంసించింది. నిజం మాట్లాడిన తొలి బీజేపీ మంత్రిని నితిన్ గడ్కరీని మేం అభినందిస్తున్నామని, మేం, భారతీయులు అడుగుతున్న ప్రశ్నను ఆయన ఎంతో ధైర్యంగా లేవనెత్తారని కాంగ్రెస్ పేర్కొంది.
కాగా, ఆదివారం ఓ కార్యక్రమంలో గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని మహారాష్ట్రలో మరాఠాలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుండటంపై గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలే కరువయ్యాయని, అలాంటప్పుడు రిజర్వేషన్లతో పని ఏమిటని ప్రశ్నించారు.
Excellent question Gadkari Ji.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2018
Every Indian is asking the same question.#WhereAreTheJobs?https://t.co/2wfhDxuA10
ఈ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతానికి అంతగా పనిచేయదన్నారు. మరాఠాలకు రిజర్వేషన్ అంశంపై కేంద్రం చర్చిస్తోందని, అయితే, దీనిని అదనుగా చేసుకుని ప్రతిపక్షాలు ఈ అంశంపై ఆజ్యం పోస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, ఐటీ విప్లవం వల్ల బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు తగ్గిపోయాయని చెప్పారు.
మరి ఉద్యోగాలు ఎక్కడున్నాయని, అవే లేనప్పుడు ఇక రిజర్వేషన్లు ఏమిటని ప్రశ్నించారు. అందరూ మేం వెనుకబడిన వర్గాలకు చెందిన వారమే అంటారని, బీహార్, యూపీలలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారని, అక్కడ వారు రాజకీయంగానూ బలంగానే ఉన్నారని, వాళ్లు కూడా మేం వెనుకబడిన వర్గాల వారిమే అంటారని, అయితే, ప్రతి వర్గంలోనూ ఉన్న నిరుపేదలను మనం గుర్తించాలన్నారు.
అన్ని సామాజిక వర్గాల్లోను ధనికులు ఉన్నారని, అదే సమయంలో తిండి, బట్టకు నోచుకోని నిరుపేదలు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారని చెప్పారు. అలాంటి వాళ్లకే రిజర్వేషన్లు ఉపయోగపడతాయని గడ్కరీ అన్నారు. కులం ఆధారంగా కాకుండా ఆర్థికపరంగా రిజర్వేషన్లు ఇచ్చే అంశం గురించి ప్రస్తుతం ఆలోచన లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications