దారికొస్తున్న చైనా- క్రమంగా బలగాల ఉపసంహరణ-పరిస్ధితి కంట్రోల్ లోనే ఉందన్న ఆర్మీఛీఫ్
నెల రోజులుగా చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్తలకు త్వరలో శుభం కార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో డోక్లాం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల తరహాలోనే ఈసారి లడఖ్ లోనూ ఉద్రిక్తతలకు చర్చల ద్వారా ముగింపు పలికేందుకు ఇరుదేశాల సైనికాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వాస్తవాధీన రేఖ వద్ద నుంచి ఇరు దేశాల బలగాలు క్రమంగా వెనక్కి మరలుతున్నాయి.
ఫలిస్తున్న చర్చలు... బలగాలు వెనక్కి...
చైనా సైనికాధికారులతో కొన్ని రోజులుగా భారత సైనికాధికారులు జరుపుతున్న చర్చలు సవ్యంగానే సాగుతున్నాయి. దీంతో లడఖ్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న సెక్టార్లలో ఇరుదేశాల బలగాలు క్రమంగా వెనక్కి తరలివెళ్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ చురుగ్గా సాగుతోందని భారత ఆర్మీఛీఫ్ ముకుంద్ నరవణే ఇవాళ మరోసారి ధృవీకరించారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు నరవణే చెప్పారు.
పరిస్ధితి అదుపులోనే ఉందన్న ఆర్మీఛీఫ్...
సరిహద్దుల్లో పరిస్ధితి ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉందని ఆర్మీఛీఫ్ నరవణే స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని రోజులుగా చైనా అధికారులతో జరుగుతున్న చర్చలు సానుకూల దిశలోనే ఉన్నాయి ఆయన గుర్తు చేశారు. కమాండర్ స్ధాయి నుంచి మేజర్ జనరల్ స్ధాయి వరకూ చర్చలు జరుగుతున్నాయని, వీటితో పరిస్ధితి క్రమంగా అదుపులోకి వస్తోందని ఆర్మీఛీఫ్ వివరించారు. మరికొన్ని రోజుల్లో పరిస్ధితులు తిరిగి సాధారణ స్ధాయికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.
Recommended Video
యువ అధికారులదే బాధ్యత....
డెహ్రాడూన్ లోని ఆర్మీ జవాన్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న ఆర్మీఛీఫ్ నరవణే... వారినుద్దేశించి కీలక సందేశం ఇచ్చారు. దేశం ప్రస్తుతం కష్టాల్లో ఉందని, దేశ భద్రత, గౌరవం, ప్రతిష్ట అన్నీ మీ సామర్ధ్యం మీద ఆధారపడి ఉన్నాయని యువ అధికారులకు ఆర్మీఛీఫ్ దిశా నిర్దేశం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉందంటూ వారికి గుర్తు చేశారు. మంచి, చెడ్డ రెజిమెంట్లు ఉండవని, మంచి అధికారులు మాత్రమే ఉంటారని నరవణే తెలిపారు.