ఎట్టకేలకు కాంగ్రెస్ ఎంపీని ఖాళీ చేయించారు
న్యూఢిల్లీ: గడువు పూర్తయినా ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీని మంగళవారం బలవంతంగా పంపించేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్చౌదురి గత కొంత కాలంగా ఢిల్లీలోని న్యూ మోతీబాగ్ హౌస్లో ఉంటున్నారు.
అయితే అతని గడువు పూర్తవడంతో ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని కేంద్రం ఇప్పటికే పలుమార్లు సూచించింది. రంజన్చౌదురి ఈ విషయమై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రంజన్ పిటిషన్ను కొట్టివేసి ఇంటిని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం పోలీసుల సాయంతో మంగళవారం ఆ ఎంపీని ఇంటి నుంచి పంపించేసింది. దీనిపై రంజన్ మాట్లాడుతూ.. తనను వెళ్లగొట్టడం వెనుక రాజకీయపరమైన కారణాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక దీనిపై తానేమీ మాట్లాడబోనని.. తన సామాన్లను పోలీసులకే వదిలేశానని తెలిపారు. అందులో ఏ ఒక్కటి కనిపించకుండా పోయినా.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాగా, ఈ కాంగ్రెస్ ఎంపి.. గడువు ముగిసినా దాదాపు రెండేళ్లపాటు ప్రభుత్వ నివాసంలో ఉండటంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం ఎట్టకేలకు బలవంతంగా ఖాళీ చేయించింది.