మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు: దాడి, యువతి వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత మాయ శంకర్ పాఠక్పై దాడి జరిగింది. తనపై మాజీ ఎమ్మెల్యే శంకర్ పాఠక్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి బంధువులు నిందితుడిపై దాడి చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసి సమీపంలోని భగుటా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని శంకర్ పాఠక్కు చెందిన విద్యా సంస్థల్లో ఇంటర్ అభ్యసిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థిని తన రూంలోకి పిలిపించుకున్న శంకర్ పాఠక్.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని విద్యార్థిని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారంతా కళాశాలకు చేరుకుని చేరుకుని పాఠక్ను నిలదీశారు. దీంతో క్షమాపణలు చెప్పి తప్పించుకున్నాడు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయలేదు. కానీ, ఆ తర్వాత కొంత కాలం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధితురాలు విడుదల చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
తనపై పాఠక్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, శారీరకంగా హింసించాడని వీడియోలో బాధిత యువతి పేర్కొంది. అంతేగాకుండా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న 70ఏళ్ల శంకర పాఠక్.. 1991లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత విద్యా సంస్థలు స్థాపించి వాటికి ఛైర్మన్గా కొనసాగుతున్నారు. కాగా, శంకర్పై లైంగిక వేధింపులు రావడంతో బీజేపీ నేతలు స్పందించారు. పార్టీ కార్యకలాపాలకు చాలా కాలంగా శంకర్ దూరంగా ఉంటున్నారని తెలిపారు.