ఆ ప్రాంతాలు మినహా: లాక్డౌన్ సడలింపుపై మంత్రులకు ప్రధాని మోడీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగుస్తున్నప్పటికీ దేశంలో కరోనా మాత్రం నియంత్రణలోకి రాలేదు. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

లాక్డౌన్ సడలించేందుకు..
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించి మంత్రులకు కీలక సూచనలు చేశారు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ను సడలించేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రులను ప్రధాని మోడీ కోరారు. ఇది చాలా అత్యవసరమని చెప్పారు. కరోనా కట్టడి కోసం చర్యలు కొనసాగాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు ప్రధానంగా చర్చించారు.

ఆ ప్రాంతాలు మినహా..
కరోనా హాట్ స్పాట్ మినహాయించి దశల వారీగా ఆంక్షలు సడలించేలా ప్రణాళిక ఉండాలని మంత్రులకు ప్రధాని సూచించారు. అంతేగాక, దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ ప్రభావంపైనా మంత్రులతో ప్రధాని చర్చించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. కొవిడ్-19 కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి మంత్రులు చెప్పిన విషయాలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఒక్కో శాఖ ఒక్కో ప్రణాళిక..
రైతులు, పేదలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. కరోనాకు సంబంధించి తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ను గ్రామీణస్థాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని సూచించారు. అన్ని మంత్రిత్వ శాఖలు కూడా పనుల కొనసాగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాని మోడీ ఆదేశించారు. దేశంలో కరోనా హాట్ స్పాట్ లను మినహాయించి మిగితా ప్రాంతాల్లో ఒక్కో శాఖ నెమ్మదిగా పనులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించాలని మోడీ సూచించారని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Recommended Video
ఎంపీల జీతాల్లో కోత.. ఎంపీల్యాడ్స్..
ఇదే సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి రాబడి తగ్గిపోవడంతో ఎంపీల జీతాల్లో భారీగా కోత విధించింది. ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, ఎంపీల జీతాల్లో ఏడాదిపాటు 30శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్ను ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఎంపీలందరి జీతాల్లో ఏప్రిల్ నెల నుంచి ఏడాదిపాటు కోత విధించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అంతేగాక, రెండేళ్లపాటు ఎంపీ లాడ్స్ నిధులు కూడా మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. ఇక మాజీ ఎంపీల పెన్షన్ లోనూ 30 శాతం కోత పడనుంది. ఈ మేరకు పార్లమెంటు సభ్యుల జీతాలు, పెన్షన్ల చట్టం-1954ను సవరిస్తూ.. సోమవారం కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications