Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ డొల్లతనం-అసలు సంఖ్య దాటేసి..! విరుద్ధ అంచనాలతో..!
దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై పలు జాతీయ మీడియా ఛానళ్లు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఇందులో మెజార్టీ సంస్థలు జాతీయ స్దాయిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అనుకూలంగానే తమ అంచనాలను వెలువరించాయి. కానీ పలు సంస్థలు మాత్రం లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై విడుదల చేసిన ఫలితాల్లో అసలు సీట్ల సంఖ్యను దాటేస్తే, మరికొన్ని క్షేత్రస్దాయిలో పరిస్ధితులకు పూర్తి భిన్నంగా గణాంకాలను వెల్లడించాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ డొల్లతనం మరోసారి బయటపడినట్లయింది.
జాతీయ స్ధాయిలో ఎవరు అధికారం చేపట్టనున్నారనే దానిపై మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు 355 నుంచి 380 సీట్లు రావ్చొచ్చని అంచనా వేశాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో NDA 353 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 303 గెల్చుకుంది. అయితే ఈసారి విపక్ష ఇండియా కూటమి 125 నుంచి 165 స్థానాల మధ్య గెలుస్తుందని దాదాపు అన్ని సంస్థలూ అంచనా వేశాయి.కానీ భారత్ వంటి దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ ను ఇంత కచ్చితంగా వీరు అంచనా వేయడంపైనే ఎన్నో అనుమానాలున్నాయి.

ఉదాహరణకు ఏపీలో చూసుకుంటే పార్థ చాణక్య, రేస్, ఆత్మ సాక్షి ఎస్ఏఎస్, అగ్నివీర్ వంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థలపై జాతీయ స్ధాయిలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఏపీలో కుప్పలు తెప్పలుగా ఎగ్జిట్ పోల్స్ కోసమే పుట్టుకొచ్చిన సంస్థల విశ్వసనీయతపై భారీఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, కూటమి గెలుపోటముల ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థల విశ్వసనీయత ఎంత, అసలు వీటిలో గతంలో ఎన్ని సర్వేలు ఇచ్చాయి, వీటి వెనుక ఎవరున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఆయా సంస్థలు పరస్పర విరుద్దంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ గణాంకాలే.
ఏపీ ఒక్కటే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్ధితి. రాజస్థాన్లో 25 ఎంపీ సీట్లు ఉంటే న్యూస్24 ఎన్డీఏకి 33 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ లో ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో 4 ఎంపీ సీట్లు మాత్రమే ఉంటే అక్కడ ఎన్డీయే 6-8 సీట్లు గెలుస్తోందని జీన్యూస్, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. యాక్సిస్ ఎగ్జిట్ పోల్ లోనే 10 సీట్లున్న హర్యానాలో ఎన్డీయేకి 16-19 సీట్లు వచ్చినట్లు చూపడం వివాదాస్పదమైంది.
అలాగే 21 లోక్సభ స్థానాలున్న ఒడిశాలో ఇండియా టుడే టీవీ బీజేపీకి 18-20 సీట్లు, బీజేడీకి 2, కాంగ్రెస్కు 1 సీటు ఇచ్చింది. యాక్సిస్ మై ఇండియా ప్రకారం బీహార్లో ఎల్జేపీ 5 స్థానాల్లో పోటీ చేయగా 4-6 స్థానాల్లో విజయం సాధిస్తోందని ఇచ్చారు. దీంతో విపక్ష ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్ ను అశాస్త్రీయమని, ఇవి మోడీ పోల్స్ అంటూ కొట్టిపారేస్తోంది. రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ కోసం తయారైన పలు సంస్థల అంచనాలు కూడా క్షేత్రస్దాయిలో పరిస్ధితులకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications