ఎగ్జిట్ పోల్: మోడీ హవా, ఢిల్లీలో మూడింట బీజేపీదే గెలుపు, కేజ్రీ ట్వీట్!
ఢిల్లీలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం మూడు కార్పొరేషన్లను ఆ పార్టీ కైవశం చేసుకుంటుందని, అధికార ఏఏపీకి ద్వితీయ స్థానం తప్పదని పేర్కొంది.
మూడు కార్పొరేషన్లలో మొత్తం 272 సీట్లు ఉండగా, 218 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఏబీపీ సర్వేలో వెల్లడైంది. ఏఏపీకి 24, కాంగ్రెస్ మూడోస్థానంలో నిలిచి 22 స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొంది.
ఎగ్జిట్ పోల్ సర్వేలు నిజమైతే ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీకి ఇది వరుసగా మూడో గెలుపు. ఆదివారం నాడు నార్త్, ఈస్ట్, సౌత్ మున్సిపల్ కార్పోరేషన్లలో ఎన్నికలు జరిగాయి. సర్వేల ప్రకారం..
ఇదీ లెక్క
ఉత్తర ఢిల్లీలో 104 స్థానాలు ఉన్నాయి. ఏబీపీ న్యూస్ - సీ ఓవటరు సర్వే ప్రకారం బీజేపీ 88 స్థానాలు గెలుస్తుంది. ఏఏపీ, కాంగ్రెస్ పార్టీలు వరుసగా ఆరు, ఏడు సీట్లు గెలుచుకుంటాయి.
ఈస్ట్ ఢిల్లీలో 64 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 47 స్థానాలు గెలుచుకుంటుంది. ఏఏపీ 9 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ ఆరు సీట్లు గెలుచుకుంటుంది.
దక్షిణ ఢిల్లీలో 104 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 83 స్థానాలు గెలుచుకుంటుంది. ఏఏపీ, కాంగ్రెస్ చెరో.. 9 సీట్లు గెలుచుకోనున్నాయి.
272 స్థానాలకు 218 బీజేపీవే
మొత్తంగా 272 స్థానాలకు గాను బీజేపీ 218 స్థానాలు గెలుచుకుంటుంది. ఏఏపీ 24 సీట్లు, కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకుంటుంది.
మరో ఎగ్సిట్ పోల్... యాక్సిస్ ఇండియా టుడే ప్రకారం... బీజేపీ 202 నుంచి 220 సీట్ల మధ్య గెలుచుకుంటుంది. ఏఏపీ 23-35 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 19-31 సీట్ల మధ్య గెలుచుకుంటుంది.
మోడీ హవా
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ హవా, బీజేపీ విజయ దుందుభి కొనసాగతోందని అర్థమవుతోంది. వరుసగా రెండుసార్లు బీజేపీ ఎంసీడీలో అధికారంలో ఉంది. వరుసగా పాలిస్తున్నందున వ్యతిరేకత ఉండవచ్చునని కొందరు భావించారు. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం బీజేపీ గెలుపు ఖాయమని చెబుతున్నాయి.
అంతకుముందు.. కేజ్రీవాల్..
మున్సిపల్ ఎన్నికలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్లో ఈవీఎం సమస్యలు తలెత్తాయంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈవీఎంలు సరిగా పనిచేయడంలేదని ఢిల్లీ అంతటి నుంచి రిపోర్టులు వస్తున్నాయని, ఓటర్ స్లిప్లు ఉన్నవారిని కూడా ఓటు వేసేందుకు అనుమతించట్లేదని, అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ట్వీట్ చేశారు. కేజ్రీ తన వ్యాఖ్యల ద్వారా ఓటమిని ముందే గుర్తించారని అంటున్నారు.