ఐటీలో అనిశ్చితి: అన్ని రంగాల్లో ఇదే దుస్థితి.. ఏటా లక్ష ఉద్యోగాలు హంఫట్
మొన్నమొన్నటి వరకు ఐటీ ఉద్యోగం అంటే మహా క్రేజీ.. కానీ రాన్రాను పరిస్థితులు మారుతున్నాయి. అబ్బో ఐటీ అనే మాట నుంచి.. అమ్మో ఐటీ ఉద్యోగమా.. అనే దుస్థితి వచ్చేసింది.
పుణె: మొన్నమొన్నటి వరకు ఐటీ ఉద్యోగం అంటే మహా క్రేజీ.. కానీ రాన్రాను పరిస్థితులు మారుతున్నాయి. అబ్బో ఐటీ అనే మాట నుంచి.. అమ్మో ఐటీ ఉద్యోగమా.. అనే దుస్థితి వచ్చేసింది. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక, మానవవనరుల విభాగం (హెచ్ఆర్) నుంచి బెదిరింపులు తాళలేక ఇప్పటికే విలవిలలాడే పరిస్థితులు నెలకొన్నాయి.
రాజీనామా చేయాల్సిందేనని బెదిరిస్తూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిని ఆ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ జరిపిన టెలిఫోన్ సంభాషణ ఇటీవల బయటకొచ్చి తీవ్రసంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని, మహారాష్ట్రలోని పుణెలో ఐటీ ఉద్యోగులకు ఒత్తిళ్లు, బెదిరింపులు సర్వసాధారణమయ్యాయని తెలుస్తున్నది. రాజీనామా చేయాలని ఒత్తిడి చేయటమేగాక, బ్లాక్లిస్టులో పెడతామని హెచ్ఆర్ విభాగం తమను బెదిరిస్తూ ఉంటుందని పుణెలోని పలువురు ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు.
అంతే కాదు ఐటీతోపాటు బీపీవో, టెలికం, రిటైల్, బీఎఫ్ఎస్ఐ, ఆటోమొబైల్ రంగంలో వచ్చే మూడేళ్లలో ప్రతియేటా లక్ష నుంచి రెండు లక్షల మంది ఉద్యోగులు ఇంటి ముఖం పట్టక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితి నెలకొనడం ఇదే మొదటిసారి. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు స్థానికులకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఆటోమేషన్ ప్రభావంతో ఐటీ రంగంలోని ఉద్యోగులపై ఒత్తిడి భారం పెరిగిపోతున్నది. ఐటీ దిగ్గజాలు తమ లాభాలు తగ్గించుకునేందుకు సిద్ధంగా లేవు గనుక.. ఉన్న పరిధులు, పరిమితుల్లో సీనియర్లను తప్పించడం ద్వారా లాభాల లోటు తగ్గించుకునేందుకు పూనుకున్నాయి. పుణెలో ఐటీ రంగంలో ఉద్యోగాల కొరత, అకస్మిక ఉద్వాసనలపై చర్చ సర్వ సాధారణమైందంటే అతిశేయోక్తి కాదు.
రాజీనామా కోసం ఐటీ సంస్థల ఒత్తిళ్లిలా
‘విపరీతమైన ఒత్తిడి మధ్య జీవిస్తున్నాం, పనితీరులో ఇప్పటివరకు నాలుగుస్టార్లు వచ్చేవి. కానీ ఇటీవల నాలుగు టర్మ్లలో మూడింట నాకు రెండుస్టార్లే వచ్చాయి. ఎందుకు ఒక్కసారిగా నా ప్రదర్శన ఇలా పడిపోయిందో నాకే అంతుబట్టటం లేదు. మా ఆఫీసులోనే ఎవరో కావాలని ఇలా చేస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇది నా కుటుంబ, సామాజిక జీవనంపై ప్రభావం పడుతున్నది' అని ఓ ఐటీ ఉద్యోగి చెప్పారు. ‘రాజీనామా చేయకపోతే ఇలాంటివి మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కెరీర్ నాశనమవుతుంది. మిమ్మల్ని బ్లాక్లిస్ట్లో పెడుతాం. ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ ఒత్తిడి చేస్తున్నారు' అని ఆయన వివరించారు. కంపెనీలు ఉద్యోగుల పూర్తివివరాలు దగ్గర పెట్టుకుని, తమ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి.
‘ఎలాంటి పత్రాలు ఇవ్వకుండానే, చివరకు మా అంతట మేమే రాజీనామా చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు' అని పుణెకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు. హెచ్ఆర్ విభాగానికి చెందిన నలుగురు ఉద్యోగులు నా చుట్టుముట్టి రాజీనామా చేయాలని కోరారు. ఇలా అడుగడం అన్యాయమని అన్నాను. దీంతో బెదిరించారు. ఉద్యోగం నుంచి తొలిగిస్తామని చెబితే.. ఎందుకో స్పష్టత ఇవ్వాలని కోరాను.
దాంతో నాపై ఒత్తిడిపెంచారు అని 39 ఏండ్ల మరో ఐటీ ఉద్యోగి తన అనుభవాన్ని వివరించారు. మీడియాకు తెలుస్తుందనే భయంతో హెచ్ఆర్ విభాగం వారు.. ఓ పద్ధతి ప్రకారం ఉద్యోగులను తొలగిస్తున్నారని ఐటీ నిపుణులు పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇది వారి జీవనశైలిపై ప్రభావం చూపుతున్నదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగ భద్రతపై బెంగతో నిద్ర లేమి ఇలా
పలువురు ఐటీ నిపుణులు ఇతర సంస్థల్లోకి మారిపోయేందుకు సంసిద్ధమవుతున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో టాప్ 10 సాఫ్ట్ వేర్ సేవలందిస్తున్న సంస్థ నుంచి ఇతర సంస్థల్లోకి మారడానికి ఏటా రూ.35 లక్షల వేతనం సంపాదిస్తున్న మహిళా ఉద్యోగులు సైతం సిద్ధమవుతున్నారు. దీనికి కారణం గత ఆరు నెలల్లో ఆయా మహిళా ఉద్యోగి విభాగంలో ఆరుగురిని (25శాతం) ఉద్యోగాల నుంచి తొలగించేశారు.
అప్పటి నుంచి ఆ అమ్మాయిలో ఆందోళన మొదలైంది. ఉద్వాసన కత్తి తన మెడపై ఎప్పుడు ఏ క్షణాన పడుతుందోనన్న ఆలోచనల మధ్య ఆమెకు నిద్ర కరువైన పరిస్థితి. తల్లితోపాటు కలిసి జీవిస్తున్న ఆ యువతి ఒకవేళ ఉన్న ఉద్యోగం పోతే మళ్లీ మరో కొలువు సంపాదించుకోవడం ఎలా? అని సతమతమవుతోంది. ఇటువంటి వారు దేశవ్యాప్తంగా ఎంతమంది ఐటీ ఉద్యోగులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారో అర్థమవుతూనే ఉన్నది.
ఇలా ఐదు రెట్లు పెరిగిన ఉద్యోగాన్వేషణ
గమ్మత్తేమిటంటే కొత్త ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నవారిలో అత్యధికులు మిడిల్ మేనేజ్మెంట్, ఆ పై స్థాయిలో పనిచేస్తున్నవారే ఉండటం ఆసక్తికర పరిణామం. వారిలో చాలా మంది తమకు తెలిసిన వారితో సంప్రదిస్తూ ఉద్యోగావకాశాల కోసం అన్వేషిస్తున్నారు. గతంతో పోలిస్తే కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నదంటే ఎంతటి విషమ పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఐఐటీతోపాటు ఎంబీఏ పూర్తి చేసిన ఉద్యోగులను వదులుకునేందుకు సిద్ధ పడటం లేదు.
కానీ ఆ సంస్థ నిధుల వేటలో పరుగులు తీస్తున్న తరుణంలో సదరు ఉద్యోగి అవసరాలు తీరే మార్గం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో తక్కువ వేతనానికైనా మరో కంపెనీలో చేరిపోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ టాప్ భారత్ బహుళ జాతి సంస్థలో పని చేస్తున్న ఎంబీఏ ఉద్యోగి సైతం ఒక ఫైనాన్సియల్ టెక్ సంస్థలో సీవోవోగా చేరిపోవడానికి ఆయన మాజీ సంస్థ వద్ద నిధుల కొరతే కారణం. గత 30 ఏళ్లలో టాప్ ఎగ్జిక్యూటివ్లు, ఇంజినీర్లు, టెక్కీలు ఉద్యోగాన్వేషణలో పడటం ఇదే మొదటిసారని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఉద్యోగాలకు ఉద్వాసనపై ప్రపంచ బ్యాంక్ ఇలా
ఆటోమొబైల్ రంగంలో దిగ్గజాలుగా పేరొందిన టాటా మోటార్స్ యాజమాన్యం మిడిల్ మేనేజర్లకు వీఆర్ఎస్ ఇచ్చి పంపేసింది. సీటీఎస్ కొంత కాలం వెనక్కు నెట్టేశారు. రెండేళ్ల క్రితం అశోక్ లేబ్ లాంక్ ఇదే పనిచేసింది. మరో అగ్రశ్రేణి ఉక్కు పారిశ్రామికసంస్థ పొదుపు చర్యలు ఆశ్చర్యం కలిగించక మానవు. తమ సంస్థలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడు వేల మంది అదనపు ఉద్యోగులు పనిచేస్తున్నారని తేల్చేసింది. భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో కొన్ని అంతర్గతంగానే ఉద్యోగులను మళ్లీ నియమించుకునే ప్రక్రియ చేపట్టాయి.
అయితే వారి స్పెషలైజేషన్ సామర్థ్యాన్ని పక్కన బెట్టేయాలి మరి. రెండేళ్ల క్రితమే భారతదేశంలో సమీప భవిష్యత్లో 60 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతారని ప్రపంచ బ్యాంక్ తేల్చేసింది. భారత్ పొరుగు దేశం చైనాలో 70 శాతం, పాశ్చాత్య దేశాల్లో 50 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్లో డ్రైవర్ లేని కార్లు, మెక్ డొనాల్డ్, డొమినోస్ తదితర సంస్థల్లో రొబోలు వంటచేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ భిన్నమైంది. నగదు చెల్లింపు కౌంటర్లకు బదులు ఎటీఎంలు వచ్చేశాయి. ప్రస్తుతం వాటి స్థానే శరవేగంగా డబ్బు చెల్లించే ‘పేటీఎం'లు మార్కెట్ ను చుట్టేస్తున్నాయి. పదేళ్ల తర్వాత వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందడం కూడా దుర్లభంగా మారుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.