మరింత ఇమ్యూనిటీ పవర్: కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్కు ఎక్స్పర్ట్ ప్యానెల్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్ డోసులు ఇవ్వడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్ సీఓ)కు సంబంధించిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) గురువారం కరోనా వ్యాక్సిన్ డోసులు మిక్సింగ్ ఇవ్వడంపై కీలక చర్చ జరిపింది.
కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్స్ డోసులకు సానుకూలంగా ఎక్స్పర్ట్ ప్యానెల్
ఈ భేటీలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కలిపి ఇచ్చేందుకు సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సానుకూలతను ప్రకటించినట్లు సమాచారం. అంతేగాక, వెళ్లూర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ(సీఎంసీ)కి కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఈ మేరకు సదరు కాలేజీ ఇప్పటికే ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.
కరోనా వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ ద్వారా సామర్థ్యం పెంపు
కరోనా వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ ద్వారా వాటి సామర్థ్యం మరింత పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో సబ్జెక్ట్ నిపుణుల కమిటీ దీనిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్ల పుట్టుకొస్తున్న తరుణంలో వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ అనేది వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని మరింతగా పెంచేదిగా అవుతుందని భావిస్తున్నారు.
తొలిసారిగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్స్డ్ డోసులపై ట్రయల్స్..
దేశీయంగా ఉత్పత్తైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్పై జరుగుతున్న ట్రయల్స్ మనదేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం ద్వారా ఇమ్యూనిటీ కూడా మరింతగా పెరుగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఎబోలా, ఎయిడ్స్ లాంటి వ్యాధులను కట్టడి చేసేందుకు ఇలాంటి ప్రయోగాలను గతంలో చేయడం గమనార్హం.
Recommended Video
మిక్సింగ్ వ్యాక్సిన్ డోసుల ద్వారా మరింత ఇమ్యూనిటీ
ఒకే వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతున్నప్పటికీ.. రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం ద్వారా దాని ప్రయోజనం మరింతగా మెరుగ్గా ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. చాలా కేసుల్లో ఇది రుజువైందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాగా, జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్ మొదటిసారి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే, రెండో డోసుగా మోడెర్నా కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో మిక్సింగ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చే అంశం ఇప్పుడు కీలంగా మారింది.