షాకింగ్ : కోవిడ్ నుంచి కోలుకన్నాక బ్లాక్ ఫంగస్... ముగ్గురు చిన్నారుల కళ్లు తొలగింపు...
కరోనా గుప్పిట్లో నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో జనాల్లో భయాందోళన తొలగిపోతోంది. కానీ బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం... కొందరిలో లక్షణాలు తీవ్రమై కంటిచూపును కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముంబైకి చెందిన ముగ్గురు చిన్నారులు బ్లాక్ ఫంగస్(మ్యుకోర్మైకోసిస్) బారినపడి కళ్లను కోల్పోయారు.
ముగ్గురిలో ఒకరికి డయాబెటీస్...
బ్లాక్ ఫంగస్ బారినపడి కళ్లు కోల్పోయిన ఆ ముగ్గురు చిన్నారులు 4,6,14 ఏళ్ల వయసువారు. ఇందులో 14 ఏళ్ల బాలిక డయాబెటీస్తో బాధపడుతోంది. ఇటీవల ఆమెకు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకి 48 గంటల్లోనే ఒక కన్ను నల్లగా మారిపోయింది. దీంతో వైద్యులను సంప్రదించడంతో ఆ కన్నును తొలగించారు. బాలిక ముక్కుకు కూడా ఇన్ఫెక్షన్ సోకిందని... అయితే అదృష్టవశాత్తు అది మెదడుకు చేరలేదని వైద్యులు తెలిపారు. ఆరు వారాల పాటు బాలికకు చికిత్స అందించినట్లు చెప్పారు.
కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్...
మరో 16 ఏళ్ల బాలిక కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారినపడింది. వైద్యులు ఆమె కడుపులో బ్లాక్ ఫంగస్ను గుర్తించారు. కోవిడ్ నుంచి కోలుకున్న నెల రోజులకు ఆమె డయాబెటీస్ బారినపడటంతో పాటు బ్లాక్ ఫంగస్ సోకింది. నెల రోజుల క్రితం వరకు బాలిక ఆరోగ్యంగానే ఉందని... కరోనా నుంచి కోలుకున్న వెంటనే డయాబెటీస్ బారినపడిందని వైద్యులు తెలిపారు. ఆమె ప్రేగుల్లో రక్తస్రావం కాసాగిందని.. యాంజీయోగ్రఫీ ద్వారా ఆమె కడుపులోని రక్తనాళాలకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించామన్నారు.
మరో ఇద్దరు చిన్నారుల కళ్లు తొలగింపు
కరోనా నుంచి కోలుకున్న 4,6 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు చిన్నారులు కూడా బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ ఇద్దరి కళ్లకు బ్లాక్ ఫంగస్ సోకడంతో కళ్లు తొలగించాల్సి వచ్చింది. ఒకవేళ కళ్లు తొలగించకపోయి ఉంటే అది మెదడు,ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెంది మరణం సంభవించే అవకాశం ఉంటుంది. అప్పటికే వారికి ఒక కన్ను కనిపించడం లేదని వైద్యులు చెప్పారు. ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్ ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు వీరికి చికిత్స చేసి ఇన్ఫెక్షన్ సోకిన కళ్లను తొలగించారు.
బ్లాక్ ఫంగస్ ఎలా సోకుతుంది...
కరోనా చికిత్సలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. వైరస్ కళ్లకు సోకితే కంటిచూపు కోల్పోతారు. ఒకవేళ వైరస్ ముక్కు నుంచి మెదడుక చేరితే మరణం సంభవిస్తుంది. వ్యాధి సోకినవారిలో ముఖంపై వాపు,కళ్లు ఎర్రబడటం,కంటి చుట్టూ కండరాలు బిగుసుకుపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. మొదట్లో గుజరాత్,ఢిల్లీలో ఈ బ్లాక్ ఫంగస్ బయటపడగా ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వెంటనే గుర్తించగలిగి.. సకాలంలో చికిత్స అందిస్తే ప్రమాదమేమీ ఉండదని వైద్యులు చెబుతున్నారు.
Recommended Video