Fact check : ఆ వీడియో ఇప్పటిదేనా... ఇండిపెండెన్స్ డే నాడు వైరల్...
అగస్టు 15,భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. అమెరికాకు చెందిన వెస్ట్ పాయింట్ ఆఫీసర్స్ అకాడమీ భారత జాతీయ గీతాన్ని ఆలపించిందని... ఇది భారతీయులందరికీ గర్వ కారణమని చాలామంది ఆ వీడియోను షేర్ చేశారు. అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించడం నిజమే అయినప్పటికీ.... ఆ వీడియో మాత్రం ఇప్పటిది కాదు.
గతంలో అమెరికాలోని వాషింగ్టన్లో భారత్-అమెరికా జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్ సందర్భంగా అమెరికన్ మిలటరీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించింది. 2019,అగస్టు 15న మొదటిసారి ఈ వీడియో వెలుగుచూసింది. అప్పట్లో ఈ వీడియోని షేర్ చేసిన ANI.. జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్ సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ఆలపించిన అమెరికన్ ఆర్మీ అని పేర్కొంది. ఈ మిలటరీ ఎక్సర్సైజ్ భారత్,అమెరికా మధ్య అతిపెద్ద ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకార చర్యల్లో ఒకటి.
ఇటీవల అగస్టు 15 సందర్భంగా చాలామంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది ఈ ఏడాదే జరిగి ఉంటుందని చాలామంది భావించారు. కానీ అందులో నిజం లేదు.