కాంగ్రెస్ కు భారీ దెబ్బ, నామినేషన్ తిరస్కరణ, కోర్టు, మూడు సీట్లు మాయం, బీజేపీకి లాభం!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. నకిలీ కుల దృవీకరణ పత్రం సమర్పించారని ఒక అభ్యర్థి, ప్రభుత్వ ఉద్యోగి అంటూ మరో అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హులు అని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. ఈ దెబ్బతో కర్ణాటకలోని 224 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద 221 మంది మాత్రమే పోటీ చేస్తున్నారు.
Recommended Video
కుల దృవీకరణ పత్రం
కోలారు జిల్లా మళబాగిల్ శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొత్తనూరు మంజునాథ్ నామినేషన్ వేశారు. అయితే మంజునాథ్ నకిలీ కుల దృవీకరణ పత్రం సమర్పించారని కర్ణాటక హైకోర్టు తుది తీర్పు చెప్పింది. గురువారం ఎన్నికల అధికారులకు హై కోర్టు ఆదేశాల పత్రాలు అందడంతో కొత్తనూరు మంజునాథ్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హుడు అని ప్రకటించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే
2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎస్సీ నియోజక వర్గం అయిన మళబాగిల్ లో తాను బుడగ జంగమ కులానికి చెందిన వాడని కుల దృవీకరణ పత్రం సమర్పించిన మంజునాథ్ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి ముని అంజప్ప మీద 34 వేల ఓట్ల మేజారిటీతో కొత్తనూరు మంజునాథ్ విజయం సాధించారు.
ఐదు సంవత్సరాలకు తీర్పు
2013 ఎన్నికల్లో కొత్తనూరు మంజునాథ్ చేతిలో ఓడిపోయిన ముని అంజప్ప హై కోర్టును ఆశ్రయించారు. మంజునాథ్ నకిలీ కుల దృవీకరణ పత్రం సమర్పించారని కోర్టులో వాదించాడు. ఐదు సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్న ఈ కేసు తీర్పును బుధవారం (2018 ఏప్రిల్ 25) ప్రకటించారు. మంజునాథ్ నకిలీ కుల దృవీకరణ పత్రం సమర్పించాడని, అతను ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హుడని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర మాజీ మంత్రి కుమార్తె
కేంద్ర మాజీ మంత్రి, కోలారు లోక్ సభ సభ్యుడు కేహెచ్. మునియప్ప కుమార్తె రూపా శశిధర్ కోలారు జిల్లా కేజీఎఫ్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేస్తున్నారు. రూపా శశిధర్ కు రెండు చోట్ల ఓటు హక్కు ఉందని, ఆమె నామినేషన్ పత్రాలు తిరస్కరించాలని ప్రతిపక్ష పార్టీలు వాదించాయి. అయితే గురువారం రూపా శశిధర్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు అంగీకరించడంతో రూపా శశిధర్ ఊపిరిపీల్చుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి
శివమొగ్గ గ్రామీణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ మీద డాక్టర్ ఎస్.కే. శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. మాజీ శాసన సభ్యుడు కరియణ్ణ కుమారుడు డాక్టర్ ఎస్ కే. శ్రీనివాస్ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా న్యాయస్థానం స్టే విధించింది. ప్రభుత్వ వైద్యుడు అయిన డాక్టర్ ఎస్ కే. శ్రీనివాస్ ఎన్నికల నియమావలి అమల్లోకి వచ్చిన తరువాత ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆయన రాజీనామా చేసినందుకు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హుడని ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే విధించింది.
మూడు సీట్లు ఔట్
నకిలీ కుల దృవీకరణ పత్రం సమర్పించారని న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఒకరు, ఎన్నికల నియమాలు అమల్లో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారని కోర్టు స్టే ఇవ్వడంతో ఒకరు పోటీ చెయ్యడానికి వీలు లేకపోవడం, మేలుకోటే నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ మూడు ఎమ్మెల్యే సీట్లు కోల్పోయింది. 2018 కర్ణాటక శాస సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 221 నియోజక వర్గాల్లో మాత్రమే పోటీ చేస్తోంది.