బెంగళూరులో నకిలీ ఓటరు ఐడీ స్కాం, కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్, రూ. 90 లక్షల మరో కేసు!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగర (ఆర్ఆర్ నగర) శాసన సభ నియోజక వర్గం పరిధిలోని జాలహళ్ళిలోని ఎస్ఎల్ వీ లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో 9 వేలకు పైగా నకిలీ ఓటరు ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్న కేసులో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నిర్మాత మునిరత్న నాయుడు మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. నకిలీ ఓటరు ఐడీ కార్డుల స్కాం కేసులో 11 మంది మీద కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు మీద జాలహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు.
రాకేష్ ఫిర్యాదుతో కేసు
జాలహళ్ళికి చెందిన రాకేష్ ఎన్నికల సంఘం అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాకేష్ చేసిన ఫిర్యాదు సారాంశం ఇలా ఉంది. అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం అందడంతో ఎస్ఎల్ వీ లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 115 దగ్గరకు స్నేహితులతో కలిసి వెళ్లానని, అక్కడ నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు నకిలీ ఓటరు ఐడీ కార్డులు తయారు చేస్తూ చిక్కిపోయారని రాకేష్ ఫిర్యాదులో తెలిపాడు.
11 మంది మీద కేసులు
నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల స్కాం కేసులో నాదిర్ మోయిన్, చిన్నతంబి పోన్నియమ్మ, చిన్నదురై, లక్ష్మమ్మ రశ్మీ, లలితమ్మ, శారదా శరవణ, రేఖా, మంజుళ నంజామరి, నటరాజ్ క్రిష్ఱప్ప, మంజునాథ్, స్థానిక ఎమ్మెల్యే, ఆర్ఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు మీద జాలహళ్ళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వెంకటేష్, రఘు అనే ఇద్దరిని జాలహళ్ళి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద మరో కేసు
నకిలీ ఓటరు ఐడీ కార్డుల తయారు చేస్తున్న కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న నాయుడు మీద కేసు నమోదు కాకముందు రూ. 90 లక్షల విలువైన వివిద వస్తువులు స్వాధీనం చేసుకున్న కేసులో బెంగళూరులోని సదాశివ నగర పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులు
జాలహళ్ళిలోని అపార్ట్ మెంట్ లో స్వాధీనం చేసుకున్న ఓటరు ఐడీ కార్డులు నకిలీ కాదని, అసలైనవని ఎన్నికల సంఘం బుధవారం స్పష్టం చేసింది. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు తయారు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు ఇలా చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే ఇది బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. కాంగ్రెస్, బీజేపీ ఒకరి మీద ఒకరు ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదులు చేశారు.
బెంగళూరులో రూ. 6.8 కోట్లు సీజ్
బెంగళూరు నగరంలో వివిద కేసులు నమోదు చేసి రూ. 6.8 కోట్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి మహేశ్వర్ రావ్ మీడియాకు చెప్పారు. మొత్తం 2,007 కేసులు నమోదు చేసి రూ. 5.29 కోట్ల విలువైన 11,699 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, 39,540 కేసులు నమోదు చేసి రూ. 19.43 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు జిల్లా ఎన్నికల అధికారి మహేశ్వర్ రావ్ మీడియాకు వివరించారు.
అధికారులపై క్రిమినల్ కేసులు
మే 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు మద్య నిషేదం అమలులో ఉంటుందని మహేశ్వర్ రావు చెప్పారు. మే 11వ తేదీ శుక్రవారం మద్యాహ్నం 1.30 గంటలలోపు ఎన్నికల విధులకు హాజరుకాని అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బెంగళూరు జిల్లా ఎన్నికల అధికారి మహేశ్వర్ రావ్ హెచ్చరించారు.