ప్రాణం తీసిన మస్కిటో కాయిల్! ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని విషాద ఘటన చోటు చేసుకుంది. దోమల నివారణకు వాడే మస్కిటో కాయిల్స్ ఏకంగా కుటుంబంలోని ఆరుగురిని బలితీసుకున్నాయి. ఇంట్లో దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్స్ పెట్టుకుని ఆ కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. అయితే, తెల్లవారేసరికి ఆ కాయిల్స్ వాసనకు ఊపిరాడక ఆ కుటుంబంలోని ఆరుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ ఏడాదిన్నర చిన్నారి కూడా ఉంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో బాధిత కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం రాత్రి దోమలను నివారించేందుకు వీరు మస్కిటో కాయిల్ను అంటించి పడుకున్నారు. రాత్రి సమయంలో ఈ కాయిల్ పరుపుపై పడి మెల్లగా అంటుకుని పొగ అలుముకుంది. ఇక తలుపులు, కిటికీలు కూడా పూర్తిగా మూసి ఉన్నాయి.

పొగ కమ్ముకోవడాన్ని గమనించి వారు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. విషపూరిత గాలి పీల్చడంతో స్పృహతప్పి పడిపోయారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు.
అప్పటికే ఆరుగురు చనిపోయి ఉండగా.. మరో ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాత్రంతా విష వాయువు పీల్చడంతోనే ఈ కుటుంబంలోని ఆరుగురు మరణించారని, మరో ముగ్గురు అపస్మారక స్థితిలోనే ఉన్నారని తెలిపారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications