వర్ష బీభత్సం: వాటర్ ఫాల్స్లో చిక్కుకున్న 8మంది
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. బస్తర్జిల్లా తీసరగఢ్ వద్ద వరదలో 8 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. బయటకు వచ్చే దారి లేక వీరంతా చెట్లపై తలదాచుకున్నారు.
సుమారు 17 గంటలపాటు వీరు చెట్లపై ఉన్నారు. తర్వాత అతి కష్టంమీద స్నేహితునికి తమ పరిస్థితిపై సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు 8 మందిని అతి కష్టం మీద రక్షించారు. వీరంతా జగదల్పూర్కు చెందిన వారుగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గడ్ రాష్ట్రం జగదల్పూర్లో ఓ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న విజయ్శర్మ, అతని స్నేహితుడు నిరంజన్, ప్రసాద్ వారి కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయం తీసరత్గఢ్ జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. వీరంతా జలపాతం సమీపంలోకి వెళ్లి ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్క సారిగా జల ఉధృతి పెరిగింది.
దీంతో వారు భయంతో తలొదిక్కుకు పారిపోయి సమీపంలో ఉన్న చెట్లు ఎక్కి తలదాచుకున్నారు. ఆదివారం ఉదయం వరకు సుమారు 17 గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్లపైనే ఉన్నారు. సెల్ ఫోన్లకు సిగ్నల్ లేక ఎవరికీ ఫోన్ చేయలేక పోయారు.
చివరికి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న విజయశర్మ తన ఫోన్ నుంచి వారి బంధువులకు ఒక మేసేజ్ పంపారు. దాంతో వారు అధికారులతో సంప్రదించి సంఘటనా ప్రదేశానికి వచ్చి తాళ్ల సాయంతో వారిని రక్షించారు. అందరూ క్షేమంగా బయటకు వచ్చారు.