హిందుస్థాన్ అందరిదంటూ నినదించిన గళం - ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇందోరి ఇకలేరు - కరోనాతో..
''సబ్ కా ఖూన్ హై షామిల్ యహాకి మిట్టీ మే.. కిసీ కే బాప్ కా హిందుస్థాన్ థోడీ హై (ఈ నేలలో ప్రతి ఒక్కరి నెత్తురు దాగుంది.. హిందుస్థాన్ ఏ ఒక్కరి సొత్తోకాబోదు.. దేశం అందరిది)'' అంటూ రాహత్ ఇందోరి మస్తిష్కం నుంచి జాలువారిన కవితకు దేశం ఊర్రూతలూగింది. గడిచిన అరదశాబ్దకాలంలో చోటుచేసుకున్న అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఆ ఉర్దూ కవి కవిత ఒక నినాదంగా నిలిచింది. తన రాతలు, గుర్తులు మాత్రం వదిలేసి ఆయన తన ప్రయాణాన్ని ముగించారు.
రష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - 'స్పుత్నిక్-వి’ కోలాహలం
ప్రముఖ ఉర్దూ కవి, బాలీవుడ్ గేయ రచయిత, ఉద్యమకారుడైన రాహత్ ఇందోరీ (70) ఇకలేరు. ఇండోర్ లోని శ్రీ అరబిందో ఆస్పత్రిలో మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఆదివారం ఆస్పత్రిలో చేరగా, టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. కొవిడ్ నుంచి కోలుకుంటానంటూ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే పరిస్థితి విషమించడంతో రాహత్ మృతి చెందారు.
కరోనా సోకిన విషయం తెలియకుండానే రాహత్ ఇందోరి ఆస్పత్రిలో చేరారని, అప్పటికే 60 శాతం న్యుమోనియా ఉందని, మంగళవారం సాయంత్రం వరుసగా రెండు సార్లు హార్ట్ ఎటాక్ రావడంతో ప్రాణాలు కాపాడలేకపోయామని ఇండోర్ అరబిందో ఆస్పత్రి చీఫ్ డాక్టర్ వినోద్ భండారి మీడియాకు తెలిపారు. సమకాలీన ఉర్దు కవుల్లో గొప్పగా పేరుతెచ్చుకున్న రాహత్.. పలు ప్రజా ఉద్యమాల్లోనూ పాలుపంచుకున్నారు.
కవి రాహత్ ఇందోరి మరణంపై దేశంలోని ప్రమఖులంతా సంతాపం తెలిపారు. ''అబ్ నా మై హు, నా బాకీ హై జమానే మేరే.. ఫిర్ బీ మషూర్ హై షహరోమే ఫసానే మేరే.. (ఇప్పుడు నేను గానీ నా గతం గానీ లేదు.. కానీ ఆ ఊళ్లతో నా అనుబంధాలు ఎప్పటికీ ప్రస్తుతాలే)'' అంటూ కవి రాసిన వాక్యాలతోనే అల్విదా చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.