కోవింద్కు వీడ్కోలు: పక్షపాత రాజకీయాలు వద్దు, సంక్షేమమే మిన్న..
ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు వీడ్కోలు పలికారు. భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో (ఆదివారం) ముగియనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి హోదాలో కోవింద్ తన చివరి సందేశాన్ని ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా దేశాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు.
జాతీయ ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలను వీడనాడాలని కోరారు. ప్రజాసంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించారు. పార్లమెంటును 'ప్రజాస్వామ్య దేవాలయం' అని ఆయన అభివర్ణించారు. ఉభయ సభల్లో చర్చలు జరిగే సమయంలో సభ్యులు గాంధేయవాదాన్ని అనుసరించాలని రామ్ నాథ్ కోవింద్ హితవు పలికారు.

కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మార్గదర్శనంలో దేశం లబ్ది పొందాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. వీడ్కోలు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, మంత్రులు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
కోవింద్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. ముర్ము గిరిజన మహిళ.. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ అగ్ర కులానికి చెందినవారు. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల పదవీ కాలంలో సర్వసైన్య అధ్యక్షుడిగా పనిచేస్తారు. లోక్ సభ, రాజ్యసభ.. రాష్ట్రపతి కలిస్తేనే పార్లమెంట్ అవుతుంది. అబ్దుల్ కలాం ఆ పదవీ చేపట్టి మరింత వన్నె తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications