బిల్లుల్లో అసలేముంది... రైతులు ఎందుకు భగ్గుమంటున్నారు... వ్యవసాయ స్వరూపం మారిపోతుందా?
ఇప్పటిదాకా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు ప్రధానంగా మార్కెట్ యార్డుల్లోనే జరిగేవి. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్ల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రైవేట్,కార్పోరేట్ కంపెనీలు ప్రత్యక్షంగా రైతులతో ఒప్పందం చేసుకోవచ్చు. ప్రభుత్వానికే తమ ఉత్పత్తులను అమ్మాలన్న నిబంధన ఏమీ లేదు. అయితే ప్రైవేట్ కంపెనీలు క్రమంగా వ్యవసాయ రంగాన్ని కూడా ఆక్రమిస్తే భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లుల్లో ఏముంది... రైతులు వీటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నది ఒకసారి పరిశీలిద్దాం...

రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020
ఈ బిల్లు ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్లకు రైతులు-ప్రైవేట్ వ్యాపారులకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. రైతులు మార్కెట్ యార్డుల్లో కాకుండా తమ ఇష్టానుసారం ఏ ప్రైవేట్ వ్యాపారికైనా తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. కాబట్టి మార్కెట్ యార్డులకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ధరల నియంత్రణ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండదు. ప్రైవేట్ వ్యాపారులే రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి మార్కెటింగ్/రవాణా ఖర్చులు,ఇబ్బందులు ఉండవు. అంతరాష్ట్ర వాణిజ్యం మరింత సులభతరం అవుతుంది.

ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు(సాధికారత,రక్షణ)
ఈ బిల్లు ప్రకారం.. రైతులు భవిష్యత్తులో పండించబోయే పంటకు కూడా ముందుగానే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఒక రకంగా ఇది కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం అని కూడా చెప్పుకోవచ్చు. నిర్ణీత కాల వ్యవధికి ప్రైవేట్ వ్యాపారి రైతుతో ఒప్పందం కుదుర్చుకుని... ఆ పంటను కొనుగోలు చేస్తాడు. వ్యవసాయ సంబంధిత కంపెనీలు,ప్రాసెసర్స్,హోల్ సేలర్స్,రిటైలర్స్,ఎగుమతిదారులు.. ఎవరికైనా రైతులు తమను పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేట్ వ్యాపారులతో కాంట్రాక్ట్ విధానం ద్వారా 5 హెక్టార్ల లోపు సాగు భూమి ఉన్న చిన్న,సన్నకారు రైతులకు లబ్ది చేకూరుతుందని చెబుతోంది.

నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు 2020
ఈ బిల్లు ప్రకారం ధాన్యం,నూనె గింజలు,ఉల్లిగడ్డలు,బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించబడుతాయి. తద్వారా వీటిని భారీ మొత్తంలో నిల్వ చేసి... ఆ తర్వాత ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే పెద్ద కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ బిల్లు అవకాశం కల్పించనుంది. తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి సప్లై చైన్ ఆధునీకరించబడే అవకాశం ఉంటుంది. కోల్ట్ స్టోరేజీలు,వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుంది.

రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు...
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ వ్యవసాయ బిల్లులపై పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యవస్తోంది. ఈ బిల్లు లు చట్టరూపం దాల్చి అమలులోకి వస్తే... ఇక కార్పోరేట్ కంపెనీల దయ దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తుందని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ కంపెనీలు నిర్ణయించే ధరలకు పంటలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని... అదే జరిగితే కనీస మద్దతు ధర కూడా దక్కదని వాపోతున్నారు. దేశంలో ఎక్కువమంది చదువుకోని రైతులే ఉన్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీలతో డీలింగ్ వారికి కష్టమవుతుందని... వారు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రైతులు ప్రైవేట్ వ్యాపారులకే పంటను అమ్ముకుంటే... మార్కెట్ యార్డులు నామమాత్రంగా మిగిలిపోతాయని, ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు కూడా రాదని వాపోతున్నారు.

బిల్లులపై సందేహాలు,ప్రశ్నలు...
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ బిల్లులపై మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థ బలపడితే వ్యవసాయ సంక్షేమ,అభివృద్ది గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందా... కష్ట కాలంలో రుణాలిచ్చి ఆదుకుంటుందా... రాష్ట్రాల పరిధిలో ఇప్పుడు అమలవుతున్న రైతు బంధు లాంటి పథకాలు కొనసాగుతాయా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్నింటికి మించి పౌర సరఫరాలపై ప్రభావం పడదా.. ఇప్పటిలాగా నామమాత్రపు ధరలకే ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలను అందించగలదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications