పట్టు సడలించని రైతులు -ఇంకొద్ది గంటల్లో కేంద్రంతో చర్చలు -అమిత్ షా కీలక మంతనాలు
వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 34వ రోజుకు చేరాయి. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్లపైనే మొండిగా బైఠాయించిన రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల నేతలతో బుధవారం చర్చలు జరుపనుంది. అయితే..
కేంద్రం-రైతుల మధ్య ఆరో దఫా చర్చలకు ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ వేదికగా ఉండనుంది. బుధవారం మధ్యాహ్నం జరుగనున్న చర్చలకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి రైతు సంఘాల జేఏసీ మంగళవారం ఒక లేఖ రాసింది. తాము చేసిన నాలుగు కీలక ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించాలని రైతులు డిమాండ్ చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే దిశగా విధానాల రూపకల్పన, పంటకు కనీస మద్దతు ధర హామీకి చట్టబద్దత, ఢిల్లీలో గాలి నాణ్యత ఆర్డినెన్స్ లో రైతులకు మినహాయింపు, విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరణ అనే నాలుగు ప్రతిపాదనల విషయంలో తాము పట్టు సడలించబోమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో బుధవారం నాటి చర్చల్లో ఫలితం సానుకూలంగా వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు..
రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం చర్చలు జరపనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక మంతనాలు చేశారు. వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సుమారు రెండు గంటలపాటు షా భేటీ అయ్యారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వాదన, రైతుల డిమాండ్లపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications