ఆమెకు అండగా: గ్యాంగ్రేప్ బాధితురాలిని పెళ్లాడిన రైతు
ఛండీగఢ్: సామూహిక అత్యాచారాలు, పరువు హత్యలు, లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వంటి ప్రతికూల అంశాలతో తరచుగా వార్తల్లో ఉండే హర్యానా రాష్ట్రంలో ఓ మంచి పరిణామం చోటు చేసుకుంది. జింద్ జిల్లాకు చెందిన ఓ యువరైతు.. గ్యాంగ్ రేప్ బాధితురాలిని వివాహమాడి ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు.
ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి మద్దతుగా నిలిస్తున్నాడు ఆ ఆదర్శ రైతు. వివరాల్లోకి వెళితే.. జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) 2015, డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు.

తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. నీరజ్, అతని సహాయకులు కలిసి ఆమెను సామూహిక అత్యాచారం చేశారని, వారికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నాడు. స్థానిక పోలీసులు కొందరు నిందితులకు అండగా నిలుస్తున్నారని జితేందర్ ఆరోపించాడు.
కాగా, తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు జితేందర్. 'నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది ఆమె లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశాం' అని జితేందర్ వివరించాడు.
తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ అందరికీ ఆదర్శంగా నిలిచాడంటూ అందరూ అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications