మార్చి 26న సంపూర్ణ భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు: 15న ఆందోళనలు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా నిరసనలు చేపడుతున్న రైతు సంఘాలు.. తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే మార్చి 26న సంపూర్ణ భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
ఇప్పటికే పలుమార్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ చట్టాల్లో కోరిన సవరణలు చేసేందుకు సిద్ధమని, అయితే, చట్టాల రద్దు కుదరని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంతేగాక, ఒకటిన్నర సంవత్సరాలపాటు వాయిదా వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. కనీస మద్దతు ధర కొనసాగిస్తామని హామి ఇచ్చినప్పటికీ.. రైతు సంఘాలు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దునే డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు జరిగిన చర్చలు సఫలం కాలేదు.

మరోసారి చర్చలు జరిపేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తాజాగా మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైతు సంఘాలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించాయి. మార్చి 26న పూర్తిస్థాయి భారత్ బంద్ చేపట్టనున్నట్లు వెల్లడించాయి.
వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళనలు ఈ నాటికి నాలుగు నెలలు పూర్తవుతున్న క్రమంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు సంఘం నేత బూటా సింగ్ తెలిపారు. మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశ వ్యాప్తంగా శాంతియుత బంద్ నిర్వహిస్తామని చెప్పారు.
అంతేగాక, పెరిగిన చమురు ధరలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 15న ట్రేడ్ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొంటామని తెలిపారు. మార్చి 29న దహన్ పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేయనున్నట్లు వ్యవసాయ సంఘాల నేతలు తెలిపారు. కాగా, జనవరి 26న ఢిల్లీలో రైతు సంఘాలు జరిపిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది పోలీసులు రైతుల దాడిలో గాయాలపాలు కాగా, ఒక రైతు ట్రాక్టర్ బోల్తా పడి మరణించారు. అయితే, కొందరు తమకు సంబంధం లేనివారు వచ్చి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని రైతు నేతలు చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications