నల్ల చట్టాల విషయంలో రైతు మనస్తాపం .. సింగూ బోర్డర్ లో చెట్టుకు ఉరేసుకొని రైతు ఆత్మహత్య
దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన తిక్రీ, ఘాజీపూర్, సింగూలలో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం సాగు చట్టాల రద్దును వ్యతిరేకిస్తోంది. ఒక పక్క రైతుల ఆందోళనలు ఉదృతం చేయాలని భావిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ రైతు సింగ్ ఆందోళన స్థలం వద్ద ఓ చెట్టుకు శవంగా వేలాడుతూ కనిపించడం ఆందోళన చేస్తున్న రైతులకు తీవ్ర ఆవేదన కలిగించింది.

రైతు ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్తున్న పోలీసులు
45 ఏళ్ల ఓ రైతు మృతదేహం బుధవారం ఉదయం సింగు సరిహద్దు వద్ద రైతుల నిరసన స్థలం వద్ద షాపింగ్ మాల్ సమీపంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని, ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. మృతుడు ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని అమలో తహసీల్ రూర్కీ గ్రామానికి చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతను భారతీయ కిసాన్ యూనియన్ (BKU) ఏక్తా సిద్ధూపూర్తో అనుబంధం కలిగి ఉన్నాడు.

రైతు మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతు సంఘం నాయకులు
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తోంది. దర్యాప్తు ప్రారంభించబడిందని సోనిపట్లోని లా అండ్ ఆర్డర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి) వీరేందర్ సింగ్ చెప్పినట్లు తెలుస్తుంది. గుర్జిందర్ సింగ్, ఫతేగర్ సాహిబ్, భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా సిద్ధూపూర్ జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ, ఉదయం 6 గంటలకు సంఘటన గురించి తనకు సమాచారం వచ్చిందని, బాధితుడిని ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారని రైతు మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు నల్ల చట్టాల రద్దు జరగకపోవటంతో తీవ్ర మనస్తాపం చెందారన్న రైతులు
సోమవారం తన గ్రామాన్ని సందర్శించి, కుటుంబాన్ని కలిసి, తర్వాత ఆ రైతు సింగు సరిహద్దు ప్రాంతానికి తిరిగి వచ్చాడు. గత రెండు రోజులుగా రైతులతో జరిపిన సంభాషణలో, వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రతిష్టంభనతో వ్యవసాయ చట్టాలను రద్దు జరుగుతుందో లేదోనని తాను కలత చెందానని, ఏడాది కాలంగా రైతులు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం రైతుల డిమాండ్లను వినడం లేదని చెప్పినట్టు గుర్జిందర్ సింగ్ ప్రస్తావించారు. పంజాబ్ రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా సిద్ధూపూర్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ, ఆందోళన ప్రారంభమైనప్పటి నుండి బాధితుడు తమ యూనియన్తో అనుబంధం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

ఏడాది కాలంగా సింగు బోర్డర్ లో ఉంటున్న రైతు.. ప్రభుత్వ తీరే రైతు మృతికి కారణం
మృతి చెందిన రైతు కిసాన్ మోర్చా సమావేశాలలో స్వచ్ఛందంగా పాల్గొనేవాడని, గ్రామంలో నిరసనలలో కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. గతేడాది నుంచి రైతు ఉద్యమంలో భాగంగా సింగు సరిహద్దులో ఆందోళనలో పాల్గొంటున్నాడని వెల్లడించారు. అతను కొద్దిపాటి భూమిని కలిగిన చిన్న సన్నకారు రైతు అని, అవసరాలను తీర్చుకోవడానికి కోవిడ్ -19 కు ముందు పాఠశాల వ్యాన్ను నడిపేవాడని రైతు ఆర్థిక పరిస్థితిని వెల్లడించారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరే రైతు మృతికి కారణం అని ఆరోపిస్తున్నారు. ఇంత మంది రైతులు చనిపోతున్నా కేంద్రం స్పందించిన తీరు పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రైతు సంఘం నాయకులు.












Click it and Unblock the Notifications