ఢిల్లీ ముట్టడికి కొత్త తేదీ
Farmers' protest 2024: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాది రైతులు తమ ఆందోళనను కొనసాగించనున్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 21వ తేదీన మరోసారి ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ నెల 13వ తేదీన తొలిసారిగా ఛలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా.. వంటి 200లకు పైగా రైతు సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. ఛలో ఢిల్లీ ఆందోళనలో లక్షలాదిమంది రైతులు పాల్గొన్నారు.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్.. వంటి రాష్ట్రాల నుంచి 2,000లకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీకి తరలి వెళ్లిన విషయం తెలిసిందే. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబట్టుతున్నారు.
రైతులతో చర్చించడానికి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయెల్, నిత్యానందరాయ్తో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ నాలుగో విడత వారితో సమావేశమైంది. రైతు సంఘాల నాయకులు- కేంద్ర మంత్రుల కమిటీతో చండీగఢ్లో తెల్లవారు జాము వరకూ సాగాయి.
ఈ భేటీకి రైతుల తరఫున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైతుల సంఘాలు ప్రతిపాదించిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రుల కమిటీకి విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం గురించి వివరించారు.
ఈ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఎలాంటి ఫలితం రాలేదని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఈ కమిటీ తమ ముందు కొన్ని ప్రతిపాదనలను ఉంచిందని, నేడు, రేపు వాటిపై చర్చిస్తామని అన్నారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోతే మూడో రోజు అంటే ఈ నెల 21వ తేదీన ఛలో ఢిల్లీ ఆందోళనను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications