113వ రోజుకు చేరిన రైతుల ఆందోళన .. భారత్ బంద్ తో పాటు హోలీ నాడు సాగు చట్టాల కాపీలు దహనం
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే రైతు ఉద్యమంలో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా ఈనెల 26వ తేదీన మరోమారు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాదు హోలీ నాడు నూతన వ్యవసాయ చట్టాల కాపీలను మంటల్లో దహనం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .

మార్చి 26వ తేదీన భారత్ బంద్ .. గ్రామ స్థాయి దాకా బంద్ ప్రభావం
రైతులు ఆందోళన మొదలైన నాటి నుండి భారత్ బంద్ కు రైతులు పిలుపునివ్వడం ఇది రెండోసారి.
మార్చి 26వ తేదీన నిర్వహించనున్న భారత్ బంద్ కు వర్తక వాణిజ్య, రవాణా, విద్యార్థి, మహిళా సంఘాలు, యువత తో పాటుగా అనేక వర్గాల మద్దతు ప్రకటిస్తున్నాయని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు . ఈసారి జరగనున్న భారత్ బంద్ గ్రామస్థాయి వరకు జరగాలని రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 112 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నా కేంద్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై రైతులు మండిపడుతున్నారు.

హోలీ పండుగ నాడు సాగు చట్టాల కాపీలను తగలబెట్టనున్న రైతులు
2020 నవంబర్ 26వ తారీఖున మొదలైన రైతుల ఆందోళన కేంద్ర ప్రభుత్వం ఎన్ని విఘాతాలు కల్పిస్తున్నప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక భారత్ బంద్ తో పాటుగా రైతులు తమ ఆందోళనను ఉధృతం చేయడానికి హోలీ పండుగను సైతం ఎంచుకున్నారు. మార్చి 28 న
హోలీ పండుగ నాడు రైతులు హోలికా దహన్ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాల కాపీలను తగల పెట్టనున్నారు. అంతేకాకుండా ఆరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు .

హాజీపూర్ వద్ద రైతుల ఆందోళనల్లో మాట్లాడిన బి కే యూ అధ్యక్షుడు నరేష్ టికాయత్
ఆ సమయంలో అన్ని చోట్ల బంద్ పాటించాలని వర్తక వాణిజ్య సముదాయాలను బంద్ చేయాలని, రోడ్ లను బ్లాక్ చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు.
ఇదిలా ఉంటే నూతన వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కనీస మద్దతు ధర వ్యవస్థను కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళన ఢిల్లీ సరిహద్దుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది . ఆందోళనలో భాగంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని హాజీపూర్లో రైతులు ఆందోళనలో పాల్గొన్న బి కే యూ అధ్యక్షుడు నరేష్ టికాయత్ కేంద్రంపై విరుచుకుపడ్డారు .

రైతులు ఆందోళనను దినచర్యలో భాగం చేసుకోవాలని కోరిన టికాయత్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నమ్మదగినది కాదని ఆరోపించారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్న రైతు ఉద్యమాన్ని, దినచర్యలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని అందుకు అందరు సన్నద్ధం కావాలని నరేష్ టికాయత్ రైతులకు దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications