ముగిసిన రైతుల నిరసన: ఏడాదికిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన, నేటితో సమాప్తి
న్యూఢిల్లీ: దాదాపు ఏడాదికిపైగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో చేపడుతున్న ఆందోళనలు నేటి(డిసెంబర్ 9)తో ముగిశాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ను నెరవేరుస్తూ ప్రభుత్వం ఇటీవల ఆ చట్టాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎంఎస్పీతోపాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు రైతు సంఘాల నేతలు.
ఆయా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో.. వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు.
కాగా, ఇటీవల కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ తర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని కేంద్రం మరో హామీ ఇచ్చింది.
Farmers start removing tents from their protest site in Singhu on Delhi-Haryana
— ANI (@ANI) December 9, 2021
"We are preparing to leave for our homes, but the final decision will be taken by Samyukt Kisan Morcha," a farmer says pic.twitter.com/rzRjPkPfE1
ఈ క్రమంలో ఆందోళనను విరమించాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేస్తున్నారు రైతులు. ఇప్పటికే పలు టెంట్లను తొలగించేశారు. రైతుల నిరసనను సంయుక్త కిసాన్ మోర్చా (SKM) గురువారం అధికారికంగా విరమించుకుంది.
ఆందోళనకు కేంద్రమైన సింగు సరిహద్దులో జరిగిన సమావేశంలో రైతులు కేంద్ర వ్యవసాయ కార్యదర్శికి అందిన లేఖపై చర్చించి కేంద్రం ముసాయిదా ప్రతిపాదనకు అంగీకరించారు.