ఇందిర ఎమర్జెన్సీ నాడే మోదీకి షాకిచ్చేలా -జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్ భవన్ల ముట్టడికి రైతులు
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా తాము మాత్రం వెనుకడుగు వేసేదే లేదంటూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు కంటే మొండిగా రైతలు నిరసనలను కొనసాగిస్తునే ఉన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదు. దీంతో రైతులు తమ నిరసనల్ని తీవ్రతరం చేశారు..
Recommended Video
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 26న రైతులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ నివాసాలైన రాజ్భవన్లను ముట్టడించాలని కిసాన్ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. 40 రైతు సంఘాల ఐక్యవేదిక అయిన కిసాన్ సంయుక్త మోర్చా ప్రతినిధులు ఈ మేరకు ఉద్యమకార్యాచరణ వెల్లడించారు.
ఈనెల 26న అన్ని రాజ్ భవన్ ల ఎదుట రైతులు నల్ల జెండాలతో నిరసనలు తెలుపుతారని, గవర్నర్ నివాసాలను ముట్టడిస్తారని, కొవిడ్ నిబందనలు పాటిస్తూ, శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని కిసాన్ సంయుక్త మోర్ఛా తెలిపింది. నిరసనల్లో భాగంగానే గవర్నర్ల ద్వారా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మెమోరండాలు పంపుతామని పేర్కొంది. కాగా,
రాజ్ భవన్ ల ముట్టడి నేపథ్యంలో ఈనెల 26ను 'సేవ్ ఫార్మింగ్, సేవ్ డెమోక్రసీ' దినంగా పాటించనున్నట్లు రైతు సంఘాల నేతలు వెల్లడించారు. 1975లో సరిగ్గా అదే రోజు(జూన్ 26న) అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారని, ప్రస్తుతం మోదీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని, ప్రజాస్వామ్యాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆరోజున రాజ్ భవన్ల ముట్టడికి పిలుపుఇచ్చినట్లు రైతుల సంఘాల నేతలు చెప్పారు.